మూడు రోజుల్లో మూడు బ్యాంకుల నుండి 6400 కోట్లు కాజేశాడు..!
న్యూఢిల్లీ: బ్యాంకులను బురిడీ కొట్టించి కోట్లు కాజేసిన ఎంతో మంది ఘరానా మోసగాళ్ల గురించి విన్నాం. అయితే వీళ్లంతా ఇలా కాజేయడానికి కనీసం నెలలు, సంవత్సరాలు సమయం తీసుకుని ఉంటారు.
అలాంటిది 28 ఏళ్ల ఐలాన్ షోర్ అనే వ్యక్తి మూడు రోజుల్లో మోల్డోవా బ్యాంకుల నుంచి 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.6400 కోట్లు) కాజేశాడు. ఇందులో విశేషం ఏమిటంటే ఐలాన్ షోర్ అంత సొమ్ముని ఎలా కాజేశాడో ఆ దేశ బ్యాంకులకు కూడా అర్ధం కాకపోవడం.
దీంతో సెంట్రల్ బ్యాంకు ప్రపంచ ఆర్ధిక విచారణ కన్సెల్టెన్సీ క్రోల్ సాయం తీసుకుంది. ఐలాన్ షోర్ మోసం చేసిన తీరుని నివేదిక రూపంలో క్రోల్ అందించింది. ఈ నివేదికలో పొందుపరిచిన వివరాలిలా ఉన్నాయి.
క్రోల్, అతని సహాయకులు మోల్డోవాలోని మూడు బ్యాంకుల నుంచి కంట్రోలింగ్ వాటా కొనుగోలు చేశారు. ఆ తర్వాత బ్యాంకుల లిక్విడిటీని పెంచేలా పలు సంక్లిష్టమైన లావాదేవీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు విదేశీ కంపెనీలకు రుణాలు ఇప్పించారు.
ఈ కంపెనీలన్నింటిలోనూ షోర్కు వాటాలున్నాయని క్రోల్ పేర్కొంది. మూడు రోజుల్లో ఈ లావాదేవీల్లో భాగంగా 100 కోట్ల డాలర్ల సొమ్ముని కాజేశాడు. దీంతో అగమ్యగోచరం కాని పరిస్ధితిలో బ్యాంకులు సెంట్రల్ బ్యాంకుకు సమాచారం అందించాయి.
దీంతో ముందస్తు తక్షణ చర్యల కింద సెంట్రల్ బ్యాంకు ఆ మూడు బ్యాంకులకు 100 కోట్ల డాలర్ల మొత్తాన్ని బెయిల్ ఔట్ కింద ప్రకటించింది. ఆ తర్వాత ఈ మొత్తం లావాదేవీలపై విచారణ బాధ్యతను ఆర్ధిక విచారణ కన్సెల్టెన్సీ క్రోల్కు అప్పగించింది.
చివరకు క్రోల్ తన నివేదికలో ఈ మోసాన్ని నిరూపించడం కష్టమని, చాలా డేటా డిలీట్ చేశారని, రికార్డులు తీసుకుపోతున్న వ్యాన్ని తగలబెట్టారని పేర్కొంది. పూర్తి స్ధాయి ఫోరెన్సిక్ విచారణ చేపడితేనే నిజా నిజాలు బయటకు వస్తాయని, కాజేసిన సొమ్ముని తిరిగి రాబట్టగలమని పేర్కొంది.
ఇది ఇలా ఉంటే మూడు రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కాజేసిన షోర్ను ఆ దేశ పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని షోర్ చెబుతున్నాడు. ఇక తూర్పు యూరప్లో పేద దేశం మోల్డోవా. షోర్ కాజేసిన ఈ మొత్తం నగదు ఆ దేశ జీడీపీలో 12 శాతానికి సమానం.