ఇవాంకా టూర్: ఆమె వెంట ఒక్క అధికారే, టిల్లర్సన్ ప్రాధాన్యం ఇవ్వడం లేదా? కారణమదేనా?
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ కు అమెరికా అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదా? ఈ సదస్సును ప్రాధాన్యం లేని అంశంగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్
వాషింగ్టన్: భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ కు అమెరికా అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదా? ఈ సదస్సును ప్రాధాన్యం లేని అంశంగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ భావిస్తున్నారా?
ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఈ సదస్సుకు హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా వెంట కూడా కేవలం ఒక అధికారి మాత్రమే వస్తుండడంతో జీఈఎస్ను అమెరికా ప్రాధాన్యత లేని సదస్సుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారత్...
మహిళా సాధికారత ప్రధానాంశంగా హైదరాబాద్ లో ఈనెల 28 నుంచి మూడ్రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నిర్వహణను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి హైదరాబాద్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆయా దేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు కల్పించాల్సిన సౌకర్యాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. సదస్సు జరిగే మాదాపూర్ హైటెక్స్ తదితర ప్రాంతాల్లో చుట్టుపక్కల మూడు నాలుగు కిలోమీటర్ల వరకు భ్రదతా అధికారులు మొత్తం తమ చేతిలోకి తీసుకున్నారు.

ఇవాంకా రాక సందర్భంగా...
హైదరాబాద్ లో జరిగే జీఈఎస్కు అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాంకా రాక సందర్భంగా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఆమె భద్రత, షెడ్యూల్కు సంబంధించి రోజూ దినపత్రికల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురితమయ్యాయి.. అవుతునే ఉన్నాయి. ఆమె కోసం అమెరికా నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్లు దిగుతాయని, ఆమె తినే ఆహార పదార్థాలు కూడా అమెరికా నుంచి వచ్చిన వంటవాళ్లే తయారు చేస్తారని, ఇవాంకా అసలు హైదరాబాద్ లో ఎప్పుడు ఎక్కడికి వెళతారో.. అంతా సస్పెన్స్ అని.. ఇలా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.

ఇవాంకా వెంట ఒక్క అధికారి మాత్రమే...
అయితే భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ ను అమెరికా పెద్దగా పట్టించుకోవడం లేదని, దీనినొక ప్రాధాన్యం లేని అంశంగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ భావిస్తున్నారనే వార్తలు వినవస్తున్నాయి. అందుకే ఇవాంకా వెంట సీనియర్ ఉన్నతాధికారులను పంపించడం లేదని, కేవలం ఒక్క అధికారిని మాత్రమే టిల్లర్సన్ పంపుతున్నారని, ఈ మేరకు ఇప్పటికే ఆయన సిబ్బందికి తగిన ఆదేశాలు కూడా జారీ చేశారని,
ప్రాధాన్యతలేని సదస్సుగా భావించడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎన్ఎన్, న్యూయార్క్ డైలీ న్యూస్, డైలీ మెయిల్ వంటి వార్త సంస్థలు పేర్కొన్నాయి.

ఇవాంకా ప్రాధాన్యం తగ్గించాలనేనా?
నిజానికి అమెరికాలో జరిగే ఈ సదస్సుకు ప్రతి ఏడాది అమెరికా తరపున సెక్రటరీ ఆఫ్ స్టేట్తోపాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొనేవారు. అయితే ఈసారి ఈ సదస్సు భారత్ లో జరుగుతోంది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు అమెరికాకు ఇవాంకా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే వైట్హౌస్, ప్రభుత్వ వ్యవహారాల్లో అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జెరేడ్ కుష్నర్ల ప్రాధాన్యత పెరగడం పట్ల సెక్రటరీ ఆఫ్ రెక్స్ టిల్లర్సన్ అసహనంగా ఉన్నారట. ఈ కారణంతోనే ఇవాంకా ట్రంప్కు ప్రాధాన్యత తగ్గించాలని ఆయన భావిస్తున్నారని, అందుకే ఇవాంకా వెంట భారత్కు ముఖ్యమైన సీనియర్ అధికారులను పంపించకూడదని నిర్ణయించారని వైట్హౌస్లోని అధికారులు బాహాటంగానే పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications