పండగపూట విషాదం.. రెండు బస్సులు ఢీ కొని 21 మంది మృతి
సౌతాఫ్రికాలోని వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీ బస్ టాక్సీలు ఒకదాన్నొకటి ఢీ కొన్న ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వెస్ట్రన్ కేప్ ప్రావిన్స్ లోని ఎన్ 1 హైవేపై జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం ఆదివారం అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది. ప్రిన్స్ ఆల్బర్ట్ అలాగే లీయూ- గమ్కా ప్రాంతాల మధ్య ఈ ఘటన జరిగింది.
ఈస్ట్ కేప్ టౌన్ నుంచి దాదాపు 380 కి. మీ. దూరంలో ఈ ఘటన జరిగినట్లు ది రోడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ తెలిపింది. వెస్ట్రన్ కేప్ మొబిలిటీ డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా ఓ ఎస్ యూవీ వాహనం క్రాష్ కాగా అదే సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు మినీ బస్సులు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ముగ్గురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. భారీ రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఎన్ 1 హైవే ను పూర్తిగా మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇక రోడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ఇక ఈ ఘటనపై సౌతాఫ్రికా ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు తెలుస్తోంది.

సౌతాఫ్రికాలో మిని బస్సు ట్రాన్స్ పోర్టు సర్వీసులు సాధారణ ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నాయి. అయితే ఇటీవలికాలంలో ఈ మినీ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ రెండు వేర్వేరు ఘటనలో మిని బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదాల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది చిన్నారులు కూడా ఉండటం బాధాకరం.












Click it and Unblock the Notifications
