పంజ్షీర్పై తాలిబన్ల పంజా: రెసిస్టెన్స్ ఫ్రంట్ అధికార ప్రతినిధి దుర్మరణం
కాబుల్: రాజధాని కాబుల్ సహా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్షీర్ ప్రావిన్స్ చుక్కలు చూపుతోంది. ఈ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకోవడానికి తాలిబన్లు చేస్తోన్న ప్రయత్నాలను నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. ఆక్రమణ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోన్నాయి. తాము పంజ్షీర్ ప్రావిన్స్ను కూడా ఆక్రమించుకున్నట్లు తాలిబన్లు ఇదివరకు ఓ ప్రకటన చేసినప్పటికీ.. అది వాస్తవం కాదని తేలింది.
ఆఫ్ఘన్లో తాలిబన్ల ఆకృత్యాలు మొదలయ్యాయ్: మహిళా పోలీస్ అధికారిని..ఆమె పిల్లల ముందే
నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ మునీబ్ అమీరి సారథ్యంలో అక్కడ తాలిబన్లపై తిరుగుబాటు సాగుతోంది. గుల్బహర్ వైపు నుంచి దాడులు చేసిన తాలిబన్లను రెసిస్టెన్స్ ఫంట్ దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. వారి దాడులను తిప్పి కొట్టాయి. గుల్బహర్లోకి ఎవరూ రాకుండా తాలిబన్లు కంటెయినర్ తో రోడ్డును బ్లాక్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఈ రెండు వర్గాల మధ్య హోరాహోరీగా పోరాటం సాగుతోంది.
ఈ పరిణామాల మధ్య పంజ్షీర్ ప్రావిన్స్పై తాలిబన్లు పట్టను పెంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాలిబన్లతో సాగిస్తోన్న పోరాటంలో నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కీలక నాయకుడిని కోల్పోయింది. రెండు వర్గాల మధ్య సాగుతున్న పోరులో ఫ్రంట్ అధికార ప్రతినిధి ఫహీమ్ దాష్తీ దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ధృవీకరించింది కూడా. ఫ్రంట్ అధినేత అమీర్ సాహెబ్ అహ్మద్ మసూద్, జనరల్ సాహిబ్ అబ్దుల్ వదూద్ ఝోర్ అధికార ప్రతినిధి ఫహీమ్ దాష్తీని తాము కోల్పోయినట్లు తెలిపింది.
ఈ మేరకు ఫేస్బుక్ అధికారిక పేజీపై ఓ కథనాన్ని ప్రచురించింది. ఫహీమ దాష్తి అమరుడయ్యాడని, అల్లా వద్దకు చేరుకున్నాడని పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్ట్ ఫ్రడ్ బెజ్హాన్ కూడా దీన్ని నిర్ధారించారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇద్దరు కీలక నేతలను కోల్పోయిందని, వారిలో ఫహీమ్ దాష్తి కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. యాంటీ తాలిబన్ గ్రూపులకు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
Recommended Video
ఆదివారం రాత్రి చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడుల్లో ఫహీమ్ దాష్తీ దుర్మరణం పాలైనట్లు స్పష్టం చేశారు. పంజ్షీర్ ప్రావిన్స్లో సంభవిస్తోన్న పరిణామాలను ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి తెలియజేయడంతో పాటు నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తిరుగుబాటు దళాలను ఆయన నాయకత్వం వహించే వాడని తెలుస్తోంది. తాజాగా సంభవించిన ఈ దాడులు, ప్రతిదాడుల్లో రెండు వర్గాలు కూడా పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని చవి చూసినట్లు అనుమానిస్తున్నారు.