5 వారాల్లో రెండోసారి.. శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితి
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుంది. 5 వారాల క్రితం నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడించడంతో హింస చెలరేగింది. నిరసనాకారులతో పాటు.. పోలీసులు కూడా గాయపడ్డారు. అప్పుడు ఎమర్జెన్సీ విధించి.. వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు.
దేశంలో పరిస్థితికి అధ్యక్షుడు కారణం అనే వారు ఉన్నారు. పదవీ నుంచి దిగిపోవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. వీరికి నిరసనకారులు తోడయ్యారు. కార్మిక సంఘాలు ఇవాళ సమ్మె కూడా చేపట్టాయి. శుక్రవారం నిరసనకారులు, విద్యార్థులు పార్లమెంట్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్ ప్రయోగించి.. వారిని నిలువరించారు.
దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. దీంతో భద్రతా దళాలకు మరోసారి అధికారం ఇచ్చారు. శ్రీలంకలో ఆహార, ఇంధన, ఔషధాల కొరత ఉంది. విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు కరిగిపోతున్నాయి. దీంతో దేశం అల్లాడుతుంది. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలతో అధ్యక్షుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఎమర్జెన్సీ విధించడం తప్ప మరో మార్గం కనిపించలేదు.