పాకిస్తాన్లో తొలి హిందూ మహిళా జడ్జిగా సుమనకుమారి నియామకం
Recommended Video
పాకిస్తాన్ కోర్టులో తొలి హిందూ మహిళా జడ్జిగా సుమన్ కుమారి నియామకం జరిగింది. పాకిస్తాన్లోని కంబార్ షాహదాద్కోట్ సుమన్ స్వస్థలం. అయితే ఆమె జడ్జీగా కూడా ఆమె స్వస్థలంలోనే సేవలందించనున్నారు. సుమన్ పాక్లోని హైదరాబాదులో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం కరాచీలోని జాబిస్ట్ యూనివర్శిటీ నుంచి అదే న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తమ కేసులు వాదించేందుకు లాయర్లు ఎక్కువగా ఫీజులు తీసుకుంటుండటంతో అంత ఫీజులు చెల్లించలేక పోతున్న పేదలకు ఉచితంగా కేసులు వాదించేదని సుమన్ తండ్రి పవన్ కుమార్ బోదన్ చెప్పారు. సుమన్ ఎంచుకున్న ఉద్యోగం కష్టమైనదే అయినప్పటికీ ఆమె కష్టపడేతత్వం, నిజాయితే ఆమెకు రక్షణగా నిలుస్తుందని పవన్ కుమార్ అన్నారు.
ఇక సుమన్ తండ్రి పవన్ ఆప్తమాలజిస్ట్. సుమన్ సోదరి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా మరో సోదరి చార్టర్డ్ అకౌంటెంట్. ఇక సుమన్కు స్వతహాగా లతామంగేష్కర్ పాటలంటే ప్రాణం. అయితే జడ్జిగా ఒక హిందువు పాకిస్తాన్లో ఉండటం ఇది తొలిసారి కాదు. అంతకుముందు అంటే 2005 నుంచి 2007 మధ్య హిందూ సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ రాణా భగ్వాన్ దాస్ పనిచేశారు. అయితే ఆయన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ జనాభాలో 2శాతం హిందూ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. అంతేకాదు ఇస్లాం మతం తర్వాత పాకిస్తాన్లో అత్యధికంగా హిందూ మతమే ఉంది. నాడు దేశ విభజన సమయంలో చాలామంది భారత్ను వీడి పాకిస్తాన్కు వెళ్లిపోయారు. ముఖ్యంగా మొహ్మద్ జిన్నా అడుగుజాడల్లో నడిచినవారు చాలామంది పాకిస్తాన్కు వెళ్లి సెటిల్ అయ్యారు. అందులో ఎక్కువగా ముస్లిం సామాజికవర్గం వారే ఉన్నారు. ఇక దేశవిభజనకు ముందు నుంచి అక్కడే ఉన్న హిందువులు దేశ విభజన సమయంలో వారి ఆస్తులను వదులుకుని భారత్లోకి వచ్చేందుకు ఇష్టపడకపోవడంతో వారు అక్కడే ఉండిపోయారు.