కాబూల్ దాడికి తాలిబన్ల ప్రతీకారం-ఐఎస్ స్ధావరంపై దాడి-భారీగా తీవ్రవాదుల మట్టు
ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఈద్గా మసీదు వద్ద ఆత్మాహుతి దాడి చేసి భారీ సంఖ్యలో జనాల్ని పొట్టనబెట్టుకున్న ఐఎస్ తీవ్రవాదులపై తాలిబన్ ఫైటర్లు కన్నెర్ర చేశారు. కాబూల్ లోని ఐఎస్ అనుమానిత స్ధావరాలపై దాడులు చేస్తున్నారు. ఇందులో ఓ స్ధావరంపై జరిపిన దాడిలో పలువురు ఐఎస్ తీవ్రవాదుల్ని వారు హతమార్చారు.
నిన్న కాబూల్లోని ఈద్గా మసీదు వద్ద ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు పౌరులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఈ దాడులకు ఏ సంస్ధా బాధ్యత ప్రకటించుకోలేదు. అయినప్పటికీ ఆప్ఘన్ లో దాడులు చేసే అవసరం ప్రస్తుతానికి ఐసిస్-కె ఉగ్రవాదులకు మాత్రమే ఉందని అనుమానిస్తున్న తాలిబన్ సర్కార్.. వారి అనుమానిత స్దావరాలపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాలిబన్ ఫైటర్లు ఇప్పుడు కాబూల్లో విరుచుకుపడుతున్నారు. అనుమానితులుగా కనిపిస్తే చాలు కాల్చి చంపుతున్నారు.
వాస్తవానికి తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తల్లి మరణం నేపథ్యంలో అంత్యక్రియల కోసం తాలిబన్లు ఈద్ గా మసీదుకు చేరుకున్న సమయంలో ఐసిస్ ఈ ఆత్మాహుతి దాడి జరిపి ఐదుగురిని పొట్టనబెట్టుకుంది. దీంతో తాలిబన్లు ఐసిస్ పై రగిలిపోతున్నారు. దీంతో కాబూల్ లోని ఖైబర్ ఖానా సమీపంలో ఉన్న ఐసిస్ స్ధావరంపై దాడులు చేసి పలువురిని కాల్చి చంపినట్లు తాలిబన్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే ఆగస్టు 26న యూఎస్ దళాల్ని లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద జరిపిన బాంబు దాడుల్లో దాదాపు 170 మంది చనిపోయారు. ఆ తర్వాత తాలిబన్ ఫైటర్లపైనా దాడులు చేస్తున్నారు. ఇందులో ఓసారి 35 మంది తాలిబన్ ఫైటర్లు చనిపోయారు. ఇప్పడు తాలిబన్లను టార్గెట్ చేయగా.. ఐదుగురు సామాన్య పౌరులు చనిపోయారు. దీంతో ఆప్ఘన్ లో అంతర్యుద్ధం ముదురుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. 2019-20 సీజల్లో ఆప్ఘన్ లో అమెరికా దళాల హవా తగ్గాక ఐసిస్ వరుస దాడులకు దిగుతోంది. ఇప్పుడు తాలిబన్ సర్కార్ వారికి ముకుతాడు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో వారిని కూడా టార్గెట్ చేస్తోంది.