సాంకేతిక లోపం లేదు: బాంబు దాడి, అమెరికా
లండన్: రష్యాకు చెందిన విమానం కూలిపోవడం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని, బాంబు దాడి వలనే ఆ విమానం కూలిపోయిందని అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన భద్రతా విభాగానికి చెందిన అధికారులు ప్రకటించారు.
అయితే బాంబు దాడి చేసింది మాత్రం ఏ ఉగ్రవాద సంస్థ అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియడం లేదని, వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇటివల రష్యా విమానం కూలిపోయి 224 మంది మరణించిన విషయం తెలిసిందే.
సాంకేతిక సమస్యలు తలెత్తి విమానం కూలిపోయిందని రష్యా అధికారులు భావించారు. అయితే బాంబు దాడి వలనే విమానం కూలిపోయిందని అమెరికా, బ్రిటన్ భద్రతా విభాగాల అధికారుల విచారణలో వెలుగు చూసింది.
తామే విమానాన్ని కూల్చేశామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ విషయాన్ని అధికారులు ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. ఈజిప్టులోని సినాయ్ పెనున్స్ లా దగ్గర గత శనివారం రష్యాకు చెందిన విమానం కూలిపోయింది.
విమానం కూలిపోయిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, విమానం బాంబు దాడి వలనే కూలిపోయిందని నిర్దారణ అవుతున్నా ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది అని కచ్చితంగా తెలియడం లేదని అధికారులు అంటున్నారు.
మరింత విచారణ జరిగితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది అని కచ్చితంగా తెలుస్తుందని అమెరికా, బ్రిటన్ భద్రతా విభాగాల అధికారులు అంటున్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి సమాచారం సేకరించడానికి కీలకంగా భావించే బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే బ్లాక్ బాక్స్ కొంత వరకు ద్వంసం కావడంతో సమాచారం సేకరించడం క్లిస్టంగా మారిందని అధికారులు అంటున్నారు. గత కొంత కాలంగా రష్యా బలగాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాల పై దాడులు చేస్తుంది. అందుకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.