వీడియో: బస్టాండ్గా మారిన కాబుల్ ఎయిర్ పోర్ట్: కనిపించిన విమానాన్ని కనిపించినట్టుగా
కాబుల్: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక, ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరు మీద ప్రభుత్వాన్ని నెలకొల్పబోతోన్నారు. తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా భరించిన అనుభవం వారికి ఉంది.

ఆప్ఘన్లలో భయాందోళనలు..
తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కాబోతోన్న నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. స్వయంగా అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి తజకిస్తాన్కు వెళ్లడం- అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది. మరోసారి తాలిబన్ల ఆటవిక పరిపాలనను భరించాల్సి వస్తుందన్న భయంతో కాబులీవాలాలు దేశం వదిలి వెళ్తోన్నారు. దీనికోసం వేలాదిమంది కాబుల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే జాగారం చేశారు. కనిపించిన విమానాన్ని కనిపించినట్టే ఎక్కేశారు.
రాత్రికి రాత్రి మారిన పరిస్థితులు..
ప్రత్యేకించి- రాజధాని కాబుల్లో రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోయాయి. అప్పటిదాకా ఒంకింత ధైర్యంగా జీవించిన కాబూలీవాలాలు ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆ నగరంలో ఉండటానికి ఇష్ట పడట్లేదు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి వెళ్లిపోదామా? అనే పట్టుదలతో ఉంటోన్నారు. తాలిబన్లు కాబూల్ను ఆక్రమించడం ఆరంభమైనప్పటి నుంచీ తమ జీవితం అధ్వాన్న స్థితికి చేరిందంటూ అక్కడి మహిళలు వాపోతోన్నారు. దేశం వదిలి వెళ్లాలంటే వారికి అందుబాటులో ఉన్న ఏకైక ప్రయాణ సాధనం.. విమానాలే.
వేలాదిమంది ఎయిర్ పోర్టుకు..
రాత్రి నుంచి వేలాది మంది కాబూలీవాలాలు, ఆప్ఘనిస్థానీయులు విమానాశ్రయానికి గంపులుగంపులుగా చేరుకోవడం కనిపించింది. అత్యంత సురక్షిత ప్రదేశంగా భావించే విమానాశ్రయం మొత్తం బస్టాండ్గా మారింది. ఏ రకంగానైతే బస్సులను ఎక్కుతారో.. అదే తరహాలో విమానాలను ఆక్రమించుకున్నారు ఆప్గన్ ప్రజలు. కనిపించిన విమానాన్ని కనిపించినట్టుగా ఎక్కేయడం మొదలు పెట్టారు. సీట్ల కోసు తోసుకోవడం, తన్నుకోవడం కనిపించింది.
గాల్లో కాల్పులు జరిపిన యూఎస్ ఫోర్సెస్
మరోవంక జనం తాకిడి విపరీతంగా ఉండటంతో వారిని నియంత్రించడానికి అమెరికా భద్రతా బలగాలు గాలిలోకి కాల్పులు జరిపాయి. అదే ఎయిర్ పోర్ట్లో అమెరికా రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. వారిని తరలించడానికి జో బిడెన్ ప్రభుత్వం ఆరువేల ట్రూపులను కాబూల్కు తరలించిన విషయం తెలిసిందే. రాయబార కార్యాలయం అధికారులు, ఉద్యోగులతో పాటు అక్కడ నివసిస్తోన్న అమెరికన్లను సురక్షతంగా వారు ఎయిర్ పోర్ట్కు తరలించారు. అయినప్పటికీ.. అనూహ్యంగా వేలాదిమంది స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
మానవ హారంగా..
తమ దేశ రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, పౌరులను సురక్షితంగా ఉంచిన గదుల వైపు ఆప్గనిస్తానీయులు ఎవరూ వెళ్లకుండా నిరోధించడానికి అమెరికా భద్రతా బలగాలు మానవ హారంగా నిల్చున్నారు. వారిని దాటుకుని వెళ్లడానికి స్థానికులు ప్రయత్నించగా..చెదరగొట్టారు. గాలిలోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ.. స్థానికులు వెనుకంజ వేయలేదు. ముందుకు దూసుకెళ్లారు. విమానాశ్రయం మొత్తం మీద స్థానికులే కనిపించారు.
Recommended Video
పేలుళ్లు, కాల్పుల మోత..
తాలిబన్లు కాబుల్ను ఆక్రమించుకోవడానికి ముందు నుంచే కాల్పుల శబ్దాలు వినిపించాయని కాబుల్ పీస్ ఫోరం వ్యవస్థాపకుడు షరీఫ్ షఫీ పేర్కొన్నారు. తాను నివసించే ప్రదేశంలో ప్రతి అరగంటకు తుపాకులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, పరిస్థితులు అదుపు తప్పాయని, దేశం విడిచిపోవడం మినహా మరో మార్గం కనిపించట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని, రక్తపాతానికి అవకాశం లేకుండా జరగాలని తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications