‘మెక్డోనాల్డ్’ మీల్స్లో దంతాలు, ప్లాస్టిక్ ముక్కలు: క్షమాపణ
టోక్యో: జపాన్ దేశంలో ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన మెక్డోనాల్డ్ రెస్టారెంట్లో మీల్స్ తీసుకున్న ఓ వినియోగదారుడికి అందులో మనిషికి సంబంధించిన దంతాలు వచ్చాయి. మరో ఘటనలో మెక్డోనాల్డ్ మీల్స్లోనే ప్లాస్టిక్ ముక్కలు వచ్చాయి. అవి తిన్న ఓ చిన్నారికి గాయమైంది.
ఈ నేపథ్యంలో వినియోగదారులు మెక్డోనాల్డ్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దిగివచ్చిన మెక్డోనాల్డ్ యాజమాన్యం వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటామని వినియోగదారులకు హామీ ఇచ్చింది.
యుఎస్ వెస్ట్ కోస్ట్లో మెక్డోనాల్డ్ రెస్టారెంట్లలో పలు సమస్యలు వచ్చాయి. సిబ్బంది లేకపోవడం, వినియోగదారులకు కావాల్సిన పదార్థాలు లభించకపోవడం, డిమాండ్ తగిన సరఫరా లేకపోవడం లాంటి సమస్యలు అక్కడ ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగా జపాన్, చైనా దేశాల్లో కూడా పలు సమస్యలు వచ్చాయి.
చైనా, జపాన్లోని కొన్ని మెక్డోనాల్డ్ రెస్టారెంట్లలో తాజా మాంసాన్ని వినియోగించడం లేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. గత డిసెంబర్లో ఓ చిన్నారి ఈ రెస్టారెంట్లో ఐస్ క్రీం కొనుగోలు తినేసింది. అయితే ఐస్ క్రీంలో ఉన్న ప్లాస్టిక్ ముక్క గొంతుకు తగిలి గాయమైంది. పొరపాటున ఓ ప్లాస్టిక్ ముక్క ఆ ఐస్ క్రీంలో పడిపోయిందని మెక్డోనాల్డ్ వివరణ ఇచ్చుకుంది.
నిరుడు ఆగస్టులో ఓ వినియోగదారుడు పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలను కొనుగోలు చేశాడు. అతడు కొనుగోలు చేసిన కొన్ని ఫ్రైలలో మనిసి దంతాలు లభించాయి. తమ సిబ్బందిలోని ఎవరిదో ఒకరి దంతాలు పడివుంటాయని, తాము దంతాలతో ఫ్రైలు చేయడం లేదని మళ్లీ మెక్డోనాల్డ్ వివరణ ఇచ్చుకుంది. దంతాలు ఫ్రైలలోకి ఎలా వచ్చాయనే దానిపై ఇంకా విచారణ సాగుతుండటం గమనార్హం.
కాగా, ఇలాంటి కేసులు ఉండకూడదనేది తమ లక్ష్యమని మెక్డోనాల్డ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ టాకిహికో తెలిపారు. తాము వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించేందుకే ప్రయత్నిస్తామని చెప్పారు. తమ పిల్లలకు కూడా మెక్డోనాల్డ్ నుంచే ఆహార పదార్థాలను తెప్పించుకుంటామని ఆయన తెలిపారు. కాగా, జపాన్లో బాగా పాపులర్ అయిన మెక్డోనాల్డ్కు దాదాపు 3వేలకు పైగా శాఖలున్నాయి.