నా గుడ్ ఫ్రెండ్.. మోడీపై ట్రంప్ ప్రశంసలు..! బిత్తరపోయిన పాక్ ప్రధాని ..!
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ఇప్పటికీ ఏ చిన్న సందర్భం దొరికినా ఇరు దేశాల ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. తాజాగా ఈజిప్ట్ లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందం కుదిర్చిన సందర్భంగా అక్కడికి హాజరైన దేశాధినేతల్ని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. మరోసారి భారత్-పాక్ ప్రస్తావన తెచ్చారు.
ఈజిప్ట్ లో జరిగిన శాంతి సదస్సుకు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు 20 దేశాల అధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు వెళ్తే ట్రంప్, షరీఫ్ లతో వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతో భారత ప్రధాని మోడీ దూరంగా ఉండిపోయారు. అయితే అదే వేదికపై షెహబాజ్ షరీఫ్ ముందే ట్రంప్ అక్కడ లేని భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ బిత్తరపోయారు.

భారత్ గొప్ప దేశమని, తన మంచి స్నేహితుడు చేతుల్లో ఉందని ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఆయన అద్బుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. భారత్-పాక్ కలిసి చక్కగా జీవిస్తాయని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఈ మాట చెప్పే సమయంలో తన వెనుకే ఉన్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు చూస్తూ నిజమేగా అన్నట్లుగా ట్రంప్ అడిగారు. దీంతో ట్రంప్ కు ఏం చెప్పాలో తెలియక అవునంటూ షరీఫ్ తలాడించారు.

“India is a great country with a good friend of mine at the top. He’s done a fantastic job. I think India and Pakistan will live very nicely together,” says Donald Trump looking at Pakistan PM Shehbaz Sharif pic.twitter.com/ShrbOcm4eN
— Shashank Mattoo (@MattooShashank) October 13, 2025
అంతకు ముందు మాట్లాడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. భారత్-పాక్ యుద్దం సహా పలు యుద్దాలు ఆపారని, ఆయన్ను నోబెల్ బహుమతికి తాము నామినేట్ చేశామని గుర్తుచేసారు. ఇప్పుడు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పిన ఆయనకు నోబెల్ ఇవ్వాలని మరోసారి ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియాలోనూ ఆయన లక్షల మంది ప్రాణాలు కాపాడారన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ తాను నోబెల్ బహుమతి కోసం ఇవన్నీ చేయలేదంటూ ముక్తాయింపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications