ఫ్యామిలీ బిజినెస్ కోసం భారత్ను గెలికిన ట్రంప్: మాజీ NSA సంచలనం
Donald Trump: భారత్, అమెరికా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సంబంధాలు బలహీనపడటానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తీవ్ర ఆరోపణలు చేశారు. జో బైడెన్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన జేక్ సుల్లివన్.. ట్రంప్ 'టారిఫ్ వార్'తో రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశారని విమర్శించారు.
పాకిస్థాన్లో కుటుంబ వ్యాపారం కోసం భారత్కు నష్టం
ఓ ఇంటర్వ్యూలో జేక్ సుల్లివన్ మాట్లాడుతూ.. "పాకిస్థాన్లోని తమ కుటుంబ వ్యాపార ఒప్పందాల కారణంగానే ట్రంప్ భారత్తో సంబంధాలను దెబ్బతీశారు. బలమైన భారత్-అమెరికా సంబంధాలు మా దేశానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. ఇలాంటి కీలకమైన భాగస్వామ్యాన్ని దెబ్బతీయడం ఒక పెద్ద వ్యూహాత్మక నష్టం" అని ఆయన అన్నారు.

దశాబ్ధాల సంబంధాలను విస్మరించిన ట్రంప్
భారత్తో సంబంధాలు దెబ్బతినడం ట్రంప్ విదేశాంగ విధానంలోనే అత్యంత బలహీనమైన నిర్ణయమని జేక్ సుల్లివన్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో సాంకేతిక, ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై అమెరికా దశాబ్దాలుగా కలిసి పనిచేస్తోందని గుర్తు చేశారు. ముఖ్యంగా చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్తో కలిసి పనిచేయడం ఎంతో కీలకమని, కానీ ట్రంప్ ఈ దశాబ్దాల నాటి సంబంధాలను విస్మరించారని అన్నారు.
ప్రపంచ దేశాలకు అమెరికాపై సన్నగిల్లుతోన్న నమ్మకం
జేక్ సుల్లివన్ ఇంకా మాట్లాడుతూ.. "జర్మనీ, జపాన్ లేదా కెనడా వంటి ఇతర దేశాలు కూడా ఈ పరిస్థితిని గమనిస్తున్నాయి. భవిష్యత్తులో తమకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వవచ్చని అవి భావిస్తాయి. దీనివల్ల ప్రపంచంలో అమెరికా మిత్రదేశాలకు మనపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇది దీర్ఘకాలంలో అమెరికా ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది" అని హెచ్చరించారు. "మన మాటలకు కట్టుబడి ఉండాలి. మన మిత్రదేశాలు మనపై విశ్వాసం ఉంచాలి. ఇదే మన బలం. ఇప్పుడు భారత్తో జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా మన అన్ని సంబంధాలు, భాగస్వామ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది" అని సుల్లివన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications