దెబ్బకు దెబ్బ - వైమానిక దాడుల హోరు: మరో యుద్ధ సంకేతాలు
ఇస్తాంబుల్: టర్కీ వైమానిక బలగాలు విరుచుకుపడుతున్నాయి. కుర్దిష్ మిలిటెంట్ల శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. బాంబుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. సిరియా, ఇరాక్లల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న కుర్దిష్ మిలిటెంట్ల అంతు తేల్చేలా ఈ దాడులు సాగుతున్నాయి. ఇప్పటివరకు 89 స్థావరాలను ధ్వంసం చేసినట్లు టర్కీ సైన్యాధికారులు ప్రకటించారు. ఈ దాడులను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
టర్కీ సరిహద్దుల వెంబడి కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే), దాని సిరియా అనుబంధ సంస్థ పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్ (వైపీజీ) స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నెల 13వ తేదీన టర్కీలో భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుమంది టర్కీ పౌరులు మరణించారు. 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు కుర్దిస్తాన్ మిలీషియా గ్రూపే కారణమని టర్కీ భావించింది.
దీనికి ప్రతీకారంగా టర్కీ వైమానిక దళం రంగంలోకి దిగింది. సరిహద్దుల వెంబడి ఏర్పాటైన వాటి స్థావరాలను టర్కీ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో సిరియాలో కనీసం 11 మంది పౌరులు మరణించినట్లు కుర్దిష్ మిలీషియా ప్రతినిధి తెలిపారు. ఈ సంఖ్య 65 వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.
కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీని ఇదివరకే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు నిషేధించాయి. దీన్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. టర్కీకి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంగా వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇస్తాంబుల్లో సంభవించిన బాంబు దాడి ఘటనలో తమ హస్తం ఉందనడాన్ని తోసిపుచ్చిందీ సంస్థ.
తాజాగా కుర్దిష్తాన్ వర్కర్స్ పార్టీ, పీపుల్స్ ప్రొటెక్షన్ యూనిట్స్పై టర్కీ చేసిన వైమానిక దాడులను ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మెవ్లుట్ కవుసొగ్లు నిర్ధారించారు. సైన్యం తన ఆపరేషన్ ప్రారంభించిందని వివరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చని స్పష్టం చేశారు. మున్ముందు మరింత ఉధృతంగా దాడులు ఉంటాయనే సంకేతాలను ఇచ్చారు.