పోప్ ఫ్రాన్సిస్కు ఉక్రెయిన్ ఆహ్వానం: రిప్లై ఇదీ
వాషింగ్టన్: తన పొరుగు దేశం ఉక్రెయిన్పై రష్యా దండెత్తి నెల రోజుల కావస్తోంది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం కొనసాగుతోందే తప్ప ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రష్యా తన దాడుల తీవ్రతను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై పట్టు సాధించింది. సరిహద్దుకు ఆనుకుని ఉన్న నగాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రాజధాని కీవ్ సహా మరియోపోల్ కోసం పోరాడుతోంది. ఒడెస్సా, సుమి, ఖేర్సన్, ఖార్కీవ్, చెర్నోబిల్ వంటి నగరాలపై రష్యా పట్టు సాధించింది.
మరియోపోల్ కోసం..
రష్యా చేస్తోన్న దాడులకు ఉక్రెయిన్ ధీటుగా స్పందిస్తోంది. కీవ్ను చుట్టుముట్టి రోజులు గడుస్తున్నప్పటికీ.. రష్యా సైనిక బలగాలు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం- తన సర్వశక్తులను ఒడ్డుతోంది. రష్యా దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదే పరిస్థితి మరియోపోల్లోనూ నెలకొంది. మరియోపోల్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. మరియోపోల్ను స్వాధీనం చేసుకుంటే- నౌకాదళాలను చేరవేయడం సులభతరమౌతుందని రష్యా అంచనా వేస్తోంది.
శరణార్థులుగా..
ఈ యుద్ధంలో ఉక్రెయిన్లోని అనేక నగరాలు నేలమట్టం అయ్యాయి. రష్యా వైమానిక బలగాలు చేస్తోన్న రాకెట్ల, మిస్సైళ్ల దాడుల్లో వేలాది భవనాలు ధ్వంసం అయ్యాయి. ఏ క్షణాన ఎటువైపు నుంచి రాకెట్లు దూసుకొస్తాయో తెలియని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. బేస్మెంట్లల్లో జీవనం గడుపుతున్నారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లక్షలాది మంది ఉక్రెయిన్ ప్రజలు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు.
పోప్కు ఆహ్వానం..
ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ.. పోప్ ఫ్రాన్సిన్కు ఆహ్వానం పంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరుభూములుగా మారిన నగరాలను ప్రత్యక్షంగా తిలకించాలంటూ ఆయన పోప్ ఫ్రాన్సిన్కు విజ్ఞప్తి చేశారు. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. తమ దేశంలో శాంతి ఎక్కడుందో తనకు తెలియట్లేదని, ఆక్రమణదారుల చేతుల్లో దాడులకు గురవుతున్నామని జెలెన్స్కీ చెప్పారు.
వీడియో సందేశం..
ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పోప్ ఫ్రాన్సిస్కు పంపించారు. తమ దేశ ప్రజల కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ఆరంభమైన తరువాత జెలెన్స్కీ పోప్ ఫ్రాన్సిన్తో ఫోన్లో మాట్లాడటం ఇది రెండోసారి. కిందటి నెల 26వ తేదీన అంటే యుద్ధం ఆరంభమైన రెండోరోజు పోప్తో మాట్లాడారు. జెలెన్స్కీ.. పోప్ను సంప్రదించిన విషయాన్ని వాటికన్ సిటీ ధృవీకరించింది. ఆయన రెండోసారి ఫోన్ చేసినట్లు వాటికన్ సిటీ అధికారిక మీడియా వెల్లడించింది.
Recommended Video
ఎల్లుండి ప్రత్యేక ప్రార్థనలు..
దీనికి పోప్ ఫ్రాన్సిస్ బదులు ఇచ్చారు. ప్రపంచశాంతి కోసం శుక్రవారం తాను ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు తెలిపారు. శాంతిని కోరుకునే సమాజం.. ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచం శాంతిని కోరుకుంటుందే తప్ప..యుద్ధాలు, విధ్వేషాలను కాదని అన్నారు. మరోవంక- 25వ తేదీ నాడే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన పోలాండ్ పర్యటన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. నాటోలో సభ్యదేశమైన పోలాండ్లో జో బైడెన్ పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశం కానున్నారు.