షాకింగ్: ఉక్రెయిన్ అధ్యక్షుడి దారుణ హత్యకు రష్యా కుట్ర: 25 మందితో ప్రత్యేక దళం
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్నభీకర యుద్ధానికి అంతు అనేది లేకుండా పోతోంది. ఇప్పట్లో పుల్స్టాప్ పడేలానూ కనిపించట్లేదు. రష్యాతో వెనకడుగు వేయించడానికి పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. పైగా ఆయా చర్యలు రష్యాను మరింత రెచ్చగొట్టినట్టవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజా యూరప్, నాటో దేశాల పర్యటన కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదనేది రష్యా కొనసాగిస్తోన్న దూకుడు స్పష్టం చేస్తోంది.

శాంతి చర్చల ప్రతిపాదనలు..
ఇది కాస్తా ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనలోకి నెట్టేసింది. మూడో ప్రపంచ యుద్ధం తప్పబోదనే సంకేతాలను పంపించింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో అంచనాలకు మించిన ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తోన్నాయి. అయినప్పటికీ- రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి. రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలు ధ్వంసం అయ్యాయి.

లొంగని ఉక్రెయిన్..
యుద్ధం ఆరంభమై రోజులు గడుస్తున్నప్పటికీ.. ఉక్రెయిన్ లొంగట్లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా సహా యూరోపియన్ యూనియన్, నార్త్ అటాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) సభ్యత్వ దేశాల నుంచి అందుతోన్న ఆయుధ సంపత్తితో రష్యాను ఎదుర్కొంటోంది. ధీటుగా స్పందిస్తోంది. ఎదురొడ్డి పోరాడుతోంది. బలమైన రష్యాకు ఏ మాత్రం కొరుకుడుపడని విధంగా తయారైందా చిన్న దేశం. ఇది కాస్తా రష్యా అధి నాయకత్వానికి అసహనానికి దారి తీస్తోంది.

మట్టుబెట్టే ప్రయత్నం..
ఈ పరిణామాల మధ్య ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీని హత్య చేయడానికి రష్యా కుట్ర పన్నిందనే ప్రచారం వెలుగులోకి వచ్చింది. జెలెన్స్కీని మట్టుబెట్టడం ద్వారా ఆ దేశ సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టవుతుందని భావించిన రష్యా- ఈ కుట్రకు తెర తీసిందనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్కు చెందిన ది కీవ్ పోస్ట్ మీడియా సంస్థ దీనిపై ఓ ట్వీట్ను షేర్ చేసింది. తమ దేశాధ్యక్షుడి హత్యకు రష్యా మరోసారి ప్రయత్నించి, విఫలమైందని తెలిపింది.
25 మందితో ప్రత్యేక దళం..
వొలొదిమిర్ జెలెన్స్కీని హత్య చేయడానికి రష్యా ప్రత్యేక దళాన్ని నియమించిందని ది కీవ్ పోస్ట్ పేర్కొంది. 25 మంది మెరికల్లాంటి మిలటరీ సభ్యులు ఉన్న ఈ దళం- రష్యా స్పెషల్ సర్వీస్ ఆధీనంలో పని చేస్తోందని అంచనా వేసింది. భౌతికంగా జెలెన్స్కీని లేకుండా చేయడానికి ఈ దళానికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి చర్యల వల్ల అనైతిక యుద్ధానికి రష్యా తెర తీసినట్టు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది.

స్లోవేకియా-హంగేరి సరిహద్దుల్లో..
స్లోవేకియా- హంగేరి సరిహద్దుల గుండా తమ దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఈ 25 మంది సభ్యుల ప్రత్యేక దళాన్ని ఉక్రెయిన్ సైనిక బలగాలు బంధించాయని, వారిని విచారించడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు ది కీవ్ పోస్ట్ తెలిపింది. ఈ ప్రత్యేక దళం లక్ష్యం- జెలెన్స్కీని మట్టుబెట్టడమేనని స్పష్టం చేసింది. జెలెన్స్కీని హత్య చేయడానికి రష్యా చేసిన మరో విఫల యత్నంగా అభివర్ణించింది ది కీవ్ పోస్ట్.

ఈ మూడు డిమాండ్లతో..
మరోవంక జెలెన్స్కీ.. రష్యాతో శాంతి చర్చలకు అంగీకారం తెలిపారు. మరోసారి చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు. టర్కీలోని ఇస్తాంబుల్లో భేటీకి సిద్ధమని ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా న్యూట్రల్ స్టేటస్ అజెండాగా చర్చలను జరపాల్సి ఉంటుందని చెప్పారు. శాంతిచర్చల ద్వారా వెల్లడయ్యే ఫలితాలకు థర్డ్పార్టీ ద్వారా లీగల్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టారు. సెక్యూరిటీ గ్యారంటీలు, తటస్థత, అణ్వాయుధేతర దేశంగా గుర్తింపు.. ఈ అజెండాతో చర్చలకు తాము సిద్ధమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications