ఏ చట్టంకింద కోహినూర్ వజ్రాన్ని పాక్ తెద్దాం: కోర్టు ప్రశ్న
లాహోర్: కోహినూర్ వజ్రాన్ని ఏ చట్టం కింద పాకిస్తాన్ తీసుకు రావొచ్చో చెప్పాలని, అందుకు 2 వారాల సమయం ఇస్తున్నామని పిటిషనర్కు పాకిస్తాన్ కోర్టు చెప్పింది. ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని పాకిస్తాన్ తీసుకు రావాలని ఓ వ్యక్తి పాక్లోని పంజాబ్ రాష్ట్ర లాహోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
దీనిపై గురువారం విచారణ జరిగింది. కోహినుర్ను ఏ చట్టం ప్రకారం పాకిస్థాన్కు తీసుకురావాలని పిటిషనర్ను లాహోర్ హైకోర్టు ప్రశ్నించింది. తమ ప్రశ్నకు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది.
బ్రిటన్లో ఉన్న కోహినూర్ వజ్రం పాకిస్థాన్కు చెందినదని, దానిని అధికారులు తిరిగి పాకిస్థాన్కు తీసుకురావాలని జావెద్ ఇక్బాల్ అనే లాయర్ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోహినూరు వజ్రాన్ని భారత్కు ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించిందని, పాక్ అధికారులు దానిని మన దేశానికి తీసుకురావాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
'అప్పటి అవిభాజిత పంజాబ్ రాష్ట్రాన్ని పాలించిన మహారాజా రంజిత్ సింగ్ మనవడు దిలీప్ సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ తీసుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే ఎత్తుకెళ్లింది. అప్పుడు ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి న్యాయంగా ఆ వజ్రం పాకిస్థాన్కు చెందాల్సిందే' అని తన పిటిషన్లో న్యాయవాది పేర్కొన్నాడు.
అంతేగాక, 1953లో జరిగిన పట్టాభిషేకం సందర్భంగా కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అలంకరించారు' అని జాఫ్రీ తన పిటిషన్లో తెలిపాడు. తొలుత ప్రతివాదిగా బ్రిటన్ రాణిని కోర్టు పేర్కొనడంతో కోర్టు కేసును కొట్టివేసింది.
మళ్లీ మార్పులతో పిటిషన్ వేయడంతో కోర్టు విచారణకు అంగీకరించింది. కోహినూర్పై తాను ఇప్పటివరకు బ్రిటన్ రాణికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి 786 లేఖలు రాశానని కూడా పేర్కొన్నారు. ఇంతకాలం ఈ వజ్రం మనదని వాదిస్తున్న భారత ప్రభుత్వం పాక్ వాదనకు ఏం సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.