ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ట్రంప్..! డీల్ చేసుకోకపోతే నాశనమేనని వార్నింగ్..!
ఇరాన్ తో అణు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో స్పందించిన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా గమనిస్తే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందన్న విషయం స్పష్టంగానే అర్థమవుతోంది. అలాగే ఈ దాడులు ఆగాలంటే ఇరాన్ ఏం చేయాలో కూడా ట్రంప్ వెల్లడించారు.
నిన్న రాత్రి ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇందులో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధిపతిని మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా ఇవాళ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా 100 డ్రోన్లను సంధించింది. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పోరుతో పశ్చిమాసియాలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు.

ఇక ఏమీ మిగిలి లేదు అంటూ ఇరాన్ ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. ఈ దాడులు ఇంకా క్రూరంగా ఉండబోతున్నాయని ఆయన ఇరాన్ కు తేల్చిచెప్పేశారు. ఇది వారికి తెలిసిన, ఊహించిన లేదా చెప్పబడిన దానికంటే చాలా దారుణంగా ఉంటుందని తాను స్పష్టం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా ప్రపంచంలో ఎక్కడైనా అత్యుత్తమమైన, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను తయారు చేస్తుందని, అవి ఇజ్రాయెల్ వద్ద చాలా ఉన్నాయని ట్రంప్ తెలిపారు.

ఇంకా చాలా జరగబోతోందని, దానిని ఎలా ఉపయోగించాలో వారికి తెలుసని ఇజ్రాయెల్ ను ఉద్దేశించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. కొంతమంది ఇరానియన్ తీవ్రవాదులు ధైర్యంగా మాట్లాడారని, కానీ ఏమి జరగబోతోందో వారికి తెలియదంటూ వ్యాఖ్యానించారు. వారందరూ ఇప్పుడు చనిపోయారని, అది మరింత దిగజారిపోతుందని ట్రంప్ ఇరాన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గొప్ప మరణం, విధ్వంసం జరిగిందని, కానీ ఈ మారణహోమం, తదుపరి ప్రణాళికాబద్ధమైన దాడులు మరింత క్రూరంగా ముగియడానికి ఇంకా సమయం ఉందని హింట్ ఇచ్చేశారు.












Click it and Unblock the Notifications