1947 ఇండియాకు, 2020 ఇండియన్ అమెరికన్లకు అత్యంత కీలకం: కమలా హ్యారిస్ - గెలిస్తే ఇలా చేస్తా..
74వ భారత స్వాంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులకు, అమెరికాలోని భారత సంతతి ప్రజలకు అమెరికా డెమోక్రటిక్ పార్టీ దిగ్గజాలు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్నవేళ.. భారతీయ, ఆసియా సంతతి ఓట్లపై ఫోకస్ పెంచిన పార్టీలు.. వరసుగా కీలక కామెంట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతీయుల మద్దతు తనకే ఉందని రిపబ్లికన్, ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ వక్కాణించగా, సిసలైన భారతీయ విలువలకు తానే ప్రతినిధినని ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతోన్న కమలా హ్యారిస్ పేర్కొన్నారు.
అమెరికాలో మువ్వన్నెల రెపరెప - న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తొలిసారి భారత జెండా పండుగ..
నేను గెలిస్తే ఆ పంథాలో..
‘‘భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో కుటుంబ, సామాజిక బంధాలు బలంగా ఉంటాయి. అక్కణ్నుంచి వచ్చి అమెరికాలో ఉంటోన్నవాళ్లలోనూ అవి ప్రస్పుటంగా కనిపిస్తాయి. వలస రాజ్యాల ఆధిపత్యంపై భారతీయులు, ఇతర ఆసియా దేశాలు చూపిన సహనం, తెగువ.. పోరాటాల్లో సరికొత్త విలువల్ని సృష్టించాయి. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని మార్టిన్ లూథర్ కింగ్ సైతం అమలు చేసి చూపారు. నేను అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలిస్తే ఆ విలువలకు మళ్లీ పట్టం కడుతా'' అని కమలా హ్యారిస్ చెప్పారు.
రెండు చారిత్రక ఘట్టాలు..
అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతోన్న కమల హ్యారిస్ తాజాగా ‘‘సౌత్ ఏషియా ఫర్ బిడెన్'' ఈవెంట్ లో కీలక ఉపన్యాసం చేశారు. సరిగ్గా భారత స్వాతంత్ర్యదినోత్సవం నాడే ఆమె తన తొలి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ‘‘1947, ఆగస్టు 15 భారత్ కు అత్యంత కీలకమైన రోజు. వలసవాదం నుంచి ప్రజలు స్వాతంత్ర్యం పొందిన రోజది. మళ్లీ ఇప్పుడు, 2020, ఆగస్టు 15 అమెరికాలోని భారతీయులకూ ముఖ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను. నా తొలి ఎన్నికల ప్రచార సభను ఇవాళ, భారతీయులు, సౌత్ ఏషియన్ల మధ్య ప్రారంభించడం గర్వంగా ఉంది. భారతీయులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు'' అని కమల వ్యాఖ్యానించారు.
మాటలేకాదు, మౌనమూ ఆయన ఆయుధమే - వాజపేయి వర్ధంతిన జాతి నివాళి - సదైవ్ అటల్ వద్ద నేతల పుష్పాంజలి
భారతీయ విలువలే స్ఫూర్తి..
తన మాతృమూర్తి శామల 19 ఏళ్ల వయసులో చెన్నై నుంచి కాలిఫోర్నియాలో అడుగుపెట్టిననాడు అమెరికాలో పరిచయస్తులు లేరని, అయితే, చిన్నప్పటి నుంచి ఇంట్లో నేర్చుకున్న విలువలు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే స్వభావం ఆమెకు ఎంతో మంది స్నేహితులనిచ్చిందని, ఆక్లాండ్ లో జాతి వివక్ష వ్యతిరేక పోరాటంలోనే తన తల్లి(శ్యామల)కి తండ్రి(జమైకన్ డేవిడ్ హ్యారిస్) పరిచయం అయ్యాడని కమల గుర్తుచేశారు. చిన్నప్పుడు చెన్నైలో తాత(పీవీ గోపాలన్)తో కలిసి వాకింగ్ కు వెళ్లేవాళ్లమని, ఆ సమయంలో పోరాట యోధుల గురించి తాత ఎన్నెన్నో కథలు చెప్పేవారని, అవి తనలో స్ఫూర్తిని నింపాయని ఉపాధ్యక్ష అభ్యర్థి చెప్పుకొచ్చారు. చెన్నై ఇడ్లీ రుచులు అమోఘమని అన్నారు.
ఒబామా వారసురాలు
మానవహక్కులు, బహుళత్వం, ప్రజాస్వామ్యం, అందరికీ సమాన హక్కులు.. ఈ అంశాలపైనే తన రాజకీయ పోరాటం సాగుతుందని కమల హ్యారిస్ స్పష్టం చేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక భారత్, అమెరికా బంధాల్లో కీలకమైన మలుపని, ఇండియన్, ఆఫ్రికన్ అమెకన్ల మద్దతు ఆమెకు కలిసొస్తుందని అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ అన్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించడంలో ఒబామా వారసత్వాన్ని కమల ముందుకు నడిపించగలరని బిడెన్ వ్యాఖ్యానించారు.