పాక్ చుట్టూ ఉచ్చు: అమెరికాలో 'ఉగ్రదేశం' బిల్లు, భారత్ వెనుకే బంగ్లా
ఢాకా/వాషింగ్టన్: పాకిస్థాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మారిన ఆ దేశానికి అమెరికా దిమ్మదిరిగే షాకిచ్చేందుకు సిద్ధమవుతోందిత. పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఇద్దరు చట్టసభ ప్రతినిధులు అమెరికా కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టారు.
రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పో, డెమొక్రటిక్ పార్టీకి చెందిన డానా రోహ్రబాకర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పాకిస్థాన్కు చేస్తున్న సాయాన్ని వెంటనే నిలిపి వేయాలని, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదంపై హౌజ్ సబ్ కమిటీ చైర్మన్ కూడా అయిన టెడ్ పో అన్నారు.
పాకిస్థాన్ స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం డిసిగ్నేషన్ యాక్ట్ (హెచ్ఆర్ 6069)ను ఈ ఇద్దరూ కాంగ్రెస్ ముందు ఉంచారు. పాక్ అవిశ్వసనీయ మిత్రదేశమని, ఎన్నో ఏళ్లుగా అమెరికా శత్రువులను పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని టెడ్ పో ఆరోపించారు.
బిన్ లాడెన్కు ఆశ్రయమివ్వడం నుంచి హక్కానీ నెట్వర్క్తో సంబంధాల వరకు ఉగ్రవాదంపై యుద్ధంలో పాకిస్థాన్ ఎటువైపు ఉందో అందరికీ తెలిసిందేనని, అది కచ్చితంగా అమెరికా వైపు అయితే లేదని ఆయన అన్నారు.
కాగా, తాము ప్రవేశపెట్టిన బిల్లుపై ఒబామా ప్రభుత్వం సమాధానమివ్వాల్సిన అవసరం ఉందని టెడ్ పో అన్నారు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందో లేదో 90 రోజుల్లోపు అధ్యక్షులు వివరణ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత మరో 30 రోజుల్లో పాకిస్థాన్ ఉగ్రదేశమా కాదా అన్న దాని పైన విదేశాంగ మంత్రి మరో నివేదిక ఇవ్వాలన్నారు.
ఇక చట్టప్రతినిధి పీట్ ఓస్లోన్ యూరిలో ఉగ్రదాడిపై ప్రకటన చేశారు. భారత్పై జరిగిన ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, మిత్రదేశమైన భారత్కు కచ్చితంగా ఈ విషయంలో న్యాయం చేయాలని అన్నారు. అటు ఇండియన్ అమెరికన్స్ మాత్రం పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశమేనన్నారు. 30 ఏళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు.
యుద్ధం వస్తే భారత్ వైపే బంగ్లాదేశ్
భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం వస్తే తాము భారత్కే మద్దతు పలుకుతామని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. యూరీలో సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిన బంగ్లాదేశ్ హోం మినిస్టర్ అసద్ జమాన్ ఖాన్ కమాల్... పాకిస్తాన్ పైన తీవ్రంగా మండిపడ్డారు.
పాకిస్థాన్ లా ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతూ, పొరుగు దేశాలపైకి వారిని పురిగొల్పే ఏ దేశమైనా బంగ్లాదేశ్ కు శత్రువేనని స్పష్టం చేశారు. 1971 నుంచి ఇండియాతో తమ స్నేహ బంధం కొనసాగుతోందని గుర్తు చేసిన ఆయన, తమ పూర్తి మద్దతు ఇండియాకేనని వివరించారు.