యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్-2020: ఇరాన్, చైనా, కరోనాలపై ట్రంప్, బైడెన్ వాదనలు
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి జో బైడెన్ మధ్య అధ్యక్ష ఎన్నికలకు ముందు రెండోది, చివరిది అయిన చర్చలో కరోనా, చైనా, ఇరాన్ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
నాష్విల్లేలో జరుగుతున్న చర్చలో ఇద్దరు నేతలు మొదట అమెరికాలో కరోనావైరస్ అనంతర పరిస్థితి గురించి మాట్లాడారు.
మహమ్మారి వల్ల ప్రస్తుతం దేశంలో ఏర్పడిన పరిస్థితికి ట్రంప్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని జో బైడెన్ ఆరోపించారు.
అమెరికాలో ఇప్పటివరకూ కరోనావైరస్ వల్ల 2,22,000 మంది చనిపోయారు. దేశంలో 84 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
గత నెలలో ఇద్దరి మధ్య మొదటి చర్చ తర్వాత నుంచి ఇప్పటివరకూ 16 వేల మంది అమెరికన్లు చనిపోయారు.
కరోనావైరస్తో చర్చ ప్రారంభం
భవిష్యత్తులో ఈ మహమ్మారితో ఎలా పోరాడుతారు అనే ప్రశ్నకు,“దేశంలో కరోనావైరస్ కేసుల వృద్ధి ఇప్పుడు తగ్గిపోయింది. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలోనే తగ్గిపోతుంది. కొన్ని వారాల్లో మా దగ్గర దీనికి వ్యాక్సీన్ కూడా ఉంటుంది. మా సైన్యం దానిని ప్రజల చెంతకు చేరుస్తుంది” అని ట్రంప్ చెప్పారు.
దీనిని ప్రపంచ సమస్యగా చెప్పిన ట్రంప్, “నేను నా అనుభవంతో చెబుతున్నాను. అది నాకు వచ్చింది. నేను దాన్నుంచి బయటపడ్డాను కూడా. కోవిడ్-19 అంతం అవుతోంది” అన్నారు.
అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కరోనా వల్ల ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో మృతుల సంఖ్య 2 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారని చెప్పారు.
“మనం ఈ మాస్క్ వేసుకునే ఉంటే, మనం దాదాపు లక్ష మంది జీవితాలను కాపాడగలం. కానీ మన అధ్యక్షుడి దగ్గర దానికోసం సమగ్ర ప్రణాళిక ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకునేలా ప్రోత్సహించాలి. టెస్టింగ్ వేగంగా జరిగేలా చూడాలి. స్కూళ్లు, వ్యాపారాలు తెరిచేందుకు అధ్యక్షుడు ఒక విధానాన్ని నిర్ణయించాల”న్నారు.
కరోనా విషయంలో అధ్యక్షుడి ట్రంప్ స్పందన విచారకరమని ఇటీవల ఒక ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ వర్ణించిందని బైడెన్ చెప్పారు.
చైనా వైరస్కు మూల్యం చెల్లిస్తుందా
చైనాలో కరోనావైరస్ తొలి కేసు బయటపడినందుకు మీరు దానికి ఎలాంటి శిక్ష వేస్తారని బైడెన్ను అడిగారు. సమాధానంగా ఆయన వైరస్ బదులు వాణిజ్యం, ఫైనాన్స్ గురించి మాట్లాడారు.
“నేను చైనా పట్ల అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నడుచుకుంటాన”న్నారు. దీనికి ట్రంప్ “మొట్టమొదట చైనా దీనికి మూల్యం చెల్లించుకుంటోంది. అది మా రైతుల లక్షల డాలర్లతో చెలగాటం ఆడుతోంది” అన్నారు.
మాటల మధ్యలో బైడెన్ “టాక్స్ కట్టేవారి డబ్బులతో" అన్నారు. ఫండ్ అమెరికా నుంచి వస్తోంది, చైనా నుంచి కాదన్నారు. బదులుగా ట్రంప్ “చైనా నుంచి దిగుమతి అయ్యే ఉక్కుపై పన్నులు విధించి, అమెరికా ఉక్కు పరిశ్రమను కాపాడామ”న్నారు. దానిని బైడెన్ కొట్టిపారేశారు.
అఫ్గానిస్తాన్ పై ట్రంప్, బైడెన్ భిన్నాభిప్రాయాలు
ఉత్తరకొరియా, చైనా, రష్యా నేతలను దోపిడి దొంగలుగా వర్ణించిన బైడెన్ వారిని ట్రంప్ హత్తుకుంటున్నారని ఆరోపించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్-ట్రంప్ బంధం ఎప్పుడూలేనంత దగ్గరగా ఉందని, చాలా మందికి అది ఇబ్బంది కలిగిస్తోందని బైడెన్ అన్నారు.
ఇద్దరు నేతల మధ్య విదేశాల్లో అమెరికా పాత్ర అంశం కూడా చర్చకు వచ్చింది.
ట్రంప్ న్యూక్లియర్ బటన్కు చేరువగా ఉన్నప్పటికీ, ఆయన తన పదవీకాలంలో ఎప్పుడూ న్యూక్లియర్ వార్ వైపు వెళ్లలేదు. అధ్యక్షుడుగా సంయమనంతో ఉన్నారు. అదే సమయంలో ఏ విదేశీ యుద్ధాల్లోనూ పాల్గొనాలని ఆయన కోరుకోవడం లేదని ఎక్కువ మంది భావిస్తున్నారు.
దీనికి విరుద్ధంగా, అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్లో కీలక పాత్ర పోషించాలని బైడెన్ అంటున్నారు. తను అధ్యక్షుడు అయితే ట్రంప్ పాలనలో కంటే సుదీర్ఘంగా అక్కడ అమెరికా సైన్యం ఉండేలా చూస్తానన్నారు.
నేను ఎన్నికల్లో గెలవడం రష్యాకు ఇష్టం లేదు
నేతల చర్చ సమయంలో ఇరాన్, రష్యా గురించి కూడా ఇద్దరినీ ప్రశ్నించారు.
“నేను అధ్యక్షుడిని అయితే ఎన్నికల్లో జోక్యం చేసుకోడానికి కుట్ర పన్నుతున్న బయటి శక్తులకు గుణపాఠం చెబుతాను. రష్యా, ఇరాన్, చైనా వీటిలో జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలుసు. నేను ఎన్నికల్లో గెలవాలని రష్యా కోరుకోవడం లేదు. నేను ఇప్పటివరకూ ఏ విదేశీ సంస్థ నుంచి డబ్బులు తీసుకోలేదు. కానీ, ట్రంప్ టాక్స్ ఎగ్గొట్టాడు. ఆయన బ్యాంక్ అకౌంట్ చైనాలో ఉంది” అని బైడెన్ అన్నారు.
ఇటు ట్రంప్ “రష్యా గురించి నేను వ్యవహరించినంత కఠినంగా, బహుశా వేరే ఏ అమెరికా అధ్యక్షుడు ఉండలేదేమో” అన్నారు.
హెల్త్ కేర్పై ఇద్దరూ ఏమన్నారు...
“ఈ అంశంలో ఒబామా కేర్ హెల్త్ బిల్లు అమలును ముందుకు తీసుకెళ్లడానికి ట్రంప్ నిరాకరించారు. దానికి బదులు తను ఏది తీసుకొస్తానో కూడా ఆయన చెప్పడం లేదు. ట్రంప్ దగ్గర ఎలాంటి ప్రణాళికా లేదు. మేం దీనిపై వచ్చే పదేళ్లలో 70 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తాం” అని బైడెన్ అన్నారు.
సమాధానంగా “నేను ఒబామా కేర్ అమలును ఎప్పుడూ వద్దనలేదు. దానికంటే మెరుగైన బిల్లు తీసుకొస్తామని మేం మాట ఇచ్చాం. దాని ప్రీమియం ఒబామా కేర్ కంటే తక్కువ ఉంటుంది. మందులు కూడా చౌకగా దొరుకుతాయి. ఇప్పుడు ఇంతే చెప్పగలం, అంతకు ముంచి సమాచారం ఇవ్వలేం” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- 'బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- 'మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- 'సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)