అమెరికాలో డెల్టా వేరియంట్ కాటు: ఒక్కరోజులో వెయ్యిమందికి పైగా బలి
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి విజృంభిస్తోంది. అల్లకల్లోలానికి గురి చేస్తోంది. మునుపటి పరిస్థితులకు దారి తీస్తోంది. కరోనా వైరస్ రోజువారీ కేసులు సైతం పెరుగుదల బాట పట్టాయి. అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలో కొత్తగా 24 గంటల వ్యవధిలో వెయ్యి మందికి పైగా పేషెంట్లు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత.. ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Recommended Video

6.40 లక్షల మందికి పైగా మృతి
గత ఏడాది కరోనా వైరస్ విస్ఫోటనం ఆరంభమైనప్పటి నుంచి కూడా అమెరికాపై దాని దుష్ప్రభావం పడుతూనే వస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది.. ఇప్పటికీ. అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అక్కడే నమోదయ్యాయి. అత్యధిక మరణాలు సంభవించింది కూడా అమెరికాలోనే. ఇప్పటిదాకా 3,78,96,582 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 6,40,093 మంది మరణించారు.

పరిస్థితులు తలకిందులు
ఈ స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఫైజర్, మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను వినియోగిస్తోంది అమెరికా. ఫలితంగా- సెకెండ్ వేవ్ ప్రభావం పెద్దగా పడలేదు. రోజువారీ కొత్త కేసుల నమోదు.. మరణాలు కూడా ఇన్ని రోజుల పాటు నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. దీనికి భిన్నంగా డెల్టా వేరియంట్ రకం కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బెంబేలెత్తిస్తోన్నాయి.

24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా కరోనా మరణాలు..
అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ కరోనా వ్యాప్తి చెందడం కలవరపాటుకు గురి చేస్తోంది. డెల్టా వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత మరణాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో వెయ్యిమందికి పైగా ఈ మహమ్మారికి బలి అయ్యారు. కొంతకాలంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇప్పటికీ కరోనా మరణాల్లో అమెరికా టాప్ ప్లేస్లోనే కొనసాగుతోంది. ఇప్పటిదాకా 6,40,093 మంది మరణించారు.

బ్రెజిల్ రోండో స్థానంలో..
కరోనా వైరస్కు బలి అయిన వారిలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ లాటిన్ అమెరికా కంట్రీలో ఇప్పటిదాకా 5,70,718 మంది మరణించారు. 2,04,17,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ మూడో స్థానంలో ఉంది. 4,32,519 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు. మొత్తం కేసులు 3,22,85,857కు చేరుకున్నాయి. ఇందులో 3,14,85,923 మంది కోలుకున్నారు. వేర్వేరు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 3,67,415గా నమోదయ్యాయి. కాగా 56,06,52,030 మందికి వ్యాక్సిన్ వేయించుకున్నారు.

లక్షకు పైగా మరణించిన దేశాల జాబితా ఇదే..
కాగా- లక్షకు పైగా మరణాలు నమోదైన జాబితాలో పలు దేశాలు ఉన్నాయి. మెక్సికోలో ఇప్పటిదాకా 2,49,529 మంది మరణించారు. పెరూలో ఈ సంఖ్య 1,97,487గా నమోదైంది. రష్యా-1,72,110, బ్రిటన్-1,31,149, ఇటలీ-1,28,510, కొలంబియా-1,23,688, ఇండోనేషియా-1,20,013, అర్జెంటీనా-1,09,405 మంది మృతి చెందారు. 99,108 మరణాలతో ఇరాన్ లక్ష మార్క్కు చేరువైంది. ప్రత్యేకించి అమెరికాలో డెల్టా వేరియంట్ కలకలం రేపుతోండటం వల్ల దాని ప్రభావం భారత్పై పడే అవకాశాలు లేకపోలేదు. విమాన సర్వీసుపై విధించిన నిషేధాన్ని మరికొంతకాలం పొడిగించవచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications