భారతీయ పెట్రో కెమికల్ సంస్ధపై యూఎస్ ఆంక్షలు-చైనాకు పంపిన ఇరాన్ ఆయిల్ కొన్నందుకు
ఇరాన్ నుంచి గతంలో నిలిపివేసిన చమురు, చమురు ఉత్పత్తుల కొనుగోళ్లను అక్రమంగా నిర్వహిస్తున్న ఆరోపణలపై భారత్ కు చెందిన ఓ పెట్రో కెమికల్ సంస్ధపై అమెరికా ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది. టిబాలాజీ అనే ఈ సంస్ధ ఇరాన్ గతంలో చైనాకు పంపిన చమురు ఉత్పత్తుల్నిఅక్రమంగా కొనుగోలు చేసినందుకు అమెరికా ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ తో గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా 2018-19లో తప్పుకుంది. అయితే ఇలా అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడాన్ని సమర్ధించని భారత్.. ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తుల్ని కొనుగోలు చేయబోమని ప్రకటించింది. ఇందుకు విరుద్ధంగా ఇప్పుడు ఇరాన్ నుంచి ఓ భారతీయ సంస్ధ చమురు ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడంపై అమెరికా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇరాన్ నుంచి చమురు లేదా చమురు ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న పలు అంతర్జాతీయ సంస్ధలపై అమెరికా ప్రభుత్వం ఇవాళ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఇలా దక్షిణ, తూర్పు ఆసియా దేశాలకు ఇరాన్ చమురు ఉత్పత్తులు అమ్ముతున్న పలు సంస్ధలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ఇవాళ ప్రకటన చేసింది. ఇలా ఆంక్షలు విధించిన కంపెనీల్లో ఇరాన్ చమురు లావాదేవీలకు సహకరిస్తున్న పలువురు బ్రోకర్లు, దుబాయ్ తో పాటు గల్ఫ్, హాంకాంగ్, భారత్ నుంచి పనిచేస్తున్న కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే క్రమంలో ముంబైకి చెందిన త్రిబాలాజీ పెట్రో కెమ్ ప్రైవేట్ లిమిటెట్ కూడా ఉంది. అయితే యూఎస్ ఆంక్షలపై త్రిబాలాజీ సంస్ధ కానీ, విదేశాంగశాఖ కానీ స్పందించలేదు.