అమెరికా సెనేటర్ గ్రాహం కన్నుమూత: ఇరాన్ హిట్ లిస్ట్లో ట్రంప్, మెలోని సహా 13 మంది!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న్ భీకర యుద్ధం మధ్యలో అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం(71) ఆకస్మికంగా కన్నుమూశారు. శనివారం సాయంత్రం స్వల్పంగా అనారోగ్యానికి గురైన సెనేటర్ లిండ్సే గ్రాహం ఆకస్మికంగా మరణించారు. సౌత్ కరోలినా స్టేట్ నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు సెనేటర్గా ఉన్న గ్రాహం.. అమెరికా విదేశాంగ విధానంపై ఎక్కువగా ప్రభావం చూపేవారు. అయితే గ్రాహం మరణంపై ఇరాన్లోని ప్రధాన వార్తాపత్రికలు తమ మొదటి పేజీలో ఓ కథనాన్ని ప్రచురించి.. అమెరికాకు, దాని మిత్రదేశాలకు బహిరంగ హెచ్చరిక జారీ చేశాయి.
ఇరాన్ ప్రముఖ వార్తాపత్రిక అయిన షమ్షహ్రీ.. తన మొదటి పేజీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా దేశాల ఉన్నతాధికారులతో కూడా ఓ పెద్ద గ్రాఫిక్ను ప్రచురించింది. ఆ గ్రాఫిక్తో పాటు 'ఆకస్మిక మరణానికి సిద్ధంగా ఉండండి' అనే శీర్షికను కూడా జతచేసింది. షమ్షహ్రీ వార్తాపత్రిక ప్రచురించిన ఈ గ్రాఫిక్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 మంది ప్రధాన రాజకీయ, సైనిక నాయకులను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ మాజీ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు వీరే కారణమని ఆ పత్రిక పేర్కొంది.

ఇరాన్ హిట్ లిస్ట్లో ట్రంప్, నెతన్యాహుతో సహా 13 మంది
వార్తాపత్రికలో ప్రచురితమైన ఇరాన్ హిట్-లిస్ట్లో డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్, సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్లో అమెరికా రాయబారి మైక్ హకబీల పేర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, విదేశాంగ మంత్రి గిడియన్ సార్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఐయాల్ జమీర్ కూడా జైలు దుస్తులలో చిత్రీకరించబడ్డారు. ఆశ్చర్యకరంగా యూరోపియన్ నాయకులైన ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ కూడా ఇందులో ఉన్నారు.
'మృత్యు వ్యాపారికి మరణం'
ఇదిలా ఉండగా.. ఇరాన్కు చెందిన మరో ప్రముఖ వార్తాపత్రిక 'వతన్-ఎ-ఎమ్రోజ్'.. జులై 13న తన ప్రధాన పేజీలో సెనేటర్ లిండ్సే గ్రాహం ఫోటోతో పాటు 'మృత్యు వ్యాపారికి మరణం' అనే పెద్ద పర్షియన్ శీర్షికను ప్రచురించింది. లిండ్సే గ్రాహంను ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా విధానాలు, ఆంక్షలకు కీలక సమర్థకుడిగా, మద్దతుదారుడిగా ఆ వార్తాపత్రిక అభివర్ణించింది. ఆ వార్తాపత్రిక ప్రకారం.. లిండ్సే గ్రాహం ఆకస్మిక అనారోగ్యంతో మరణించారు. ఆ పేజీలో హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం, కొనసాగుతున్న యుద్ధంపై అనేక సంపాదకీయాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇంతలో ఇరాన్కు చెందిన మరో దినపత్రిక 'కైహాన్'.. 'ఇరాన్ తన లక్ష్యాలను సాధించింది.. యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైంది' అనే శీర్షికతో వార్తను ప్రచురించింది. అమెరికా తన వాగ్దానాలను, ఒప్పంగాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను కైహాన్ సమర్థించుకుంది.
ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం
ఇరాన్ నూతన సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల అనంతరం దేశానికి తన తొలి బహిరంగ సందేశాన్ని ఇటీవల జారీ చేసిన సమయంలోనే ఈ గ్రాఫిక్ వార్తాపత్రికలలో ప్రచురితమైంది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో చదివి వినిపించిన ఓ లిఖితపూర్వక ప్రకటనలో మొజ్తబా ఖమేనీ ఇలా ప్రకటించారు. " ఆ నేరగాళ్లు, నీచమైన హంతకుల నుంచి అమరవీరుడైన నాయకుడి, ఈ రెండు యుద్ధాల్లోని అమరవీరులందరి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం" అని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ ప్రతీకారాన్ని "ఇరాన్ జాతి ఆకాంక్ష"గా అభివర్ణిస్తూ, అది తప్పకుండా జరుగుతుందని, త్వరలోనే ప్రపంచంలోని ప్రతి స్వేచ్ఛా పౌరుడు ఈ లక్ష్యంలో తమ వంతును నెరవేరుస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications