భారతీయుల విసాలపై బాంబు పేల్చిన అమెరికా: డిపోర్ట్ భయం- డ్రైవర్లకు నో విసా
అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్లో చోటు చేసుకుంటోన్న మార్పులు.. భారతీయ విద్యార్థులను దెబ్బకొడుతున్నాయి. వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల ఆశలను నీరుగారుస్తోన్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతీయ విద్యార్థులే అధికంగా బలి అవుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చదువుకోవడానికి తమ దేశానికి వచ్చే విదేశీ విద్యార్థులపై డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్.. ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. స్టూడెంట్స్ విసాల్లో పెను మార్పులను తీసుకొచ్చాయి ఈ రెండు శాఖలు. సంస్కరణలకు తెర తీశాయి.

దీనివల్ల భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. కిందటి నెలలో 300లకు పైగా స్టూడెంట్స్ వీసాలు రద్దయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది. స్టూడెంట్ విసాల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకోవడానికి వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టింది. క్యాచ్ అండ్ రివోక్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ఇప్పుడు తాజాగా మరో బాంబు పేల్చింది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ. భారత్ సహా వివిధ దేశాలవారికి జారీ చేసిన విసాలపై కొత్త నిబంధనలను ప్రకటించింది. సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్షిస్తోన్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా నిరంతర తనిఖీలు ఉంటాయని పేర్కొంది.
ఈ సమీక్షలో భాగంగా ఏవైనా ఉల్లంఘనలు లేదా అనర్హతకు సంబంధించిన సమాచారం లభిస్తే వెంటనే విసాలను రద్దు చేస్తారు. నిబంధనలను ఉల్లంఘించిన వీసా హోల్డర్ అమెరికాలో ఉంటే, తక్షణమే దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కొ రూబియో దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో ఉండటం, నేర కార్యకలాపాలు, ప్రజా భద్రతకు ముప్పు, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. వీసా జారీ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ ఇమ్మిగ్రేషన్ రికార్డులతో సహా అందుబాటులో ఉన్న అన్ని వివరాలను సమీక్షిస్తారు.
వీసా హోల్డర్ల సోషల్ మీడియా ఖాతాలు, వారి స్వదేశాల్లో చట్టాల అమలు, ఇమ్మిగ్రేషన్ రికార్డులు, అలాగే అమెరికాలో ఉన్నప్పుడు చేసిన ఏదైనా ఉల్లంఘనలు పరిశీలిస్తారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ తరహా సమీక్ష చేపట్టడానికి ప్రధాన కారణం- వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే నివసిస్తోండట, ఫెడరల్ చట్టాల ఉల్లంఘనలే.
ట్రక్ డ్రైవర్లకు నో విసా..
అమెరికాలో భారత్ సహా విదేశీ కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లకు ఇకపై వీసాలు జారీ చేయబోమని మార్కో రూబియో ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారీ ట్రక్కులను నడుపుతున్న విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరుగుతోందని రూబియో పేర్కొన్నారు. ఇది అమెరికన్ల ప్రాణాలకు ప్రమాదకరమని, దేశీయ ట్రక్కర్ల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు.
ఇటీవలే పంజాబ్ కు చెందిన హర్జీందర్ సింగ్ అనే డ్రైవర్ నడుపుతున్న ఓ భారీ ట్రక్ ను కారు ఢీ కొట్టిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడా సెయింట్ లూసి కంట్రీలో జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అమెరికన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో తాజా నిబంధన వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే- విదేశీ ట్రక్ డ్రైవర్లు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం, రోడ్లపై ఉన్న సైన్ బోర్డులను అర్థం చేసుకోలేకపోవడం, వాటిని చదవలేకపోవడం వల్ల తరచూ ఈ తరహా ప్రమాదాలు సంభవిస్తోన్నాయని భావిస్తోంది.












Click it and Unblock the Notifications