గాజా స్ట్రిప్ కు మానవతా కారిడార్ ఏర్పాటు-ఐరాస తీర్మానాన్ని వీటో చేసేసిన అమెరికా..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య సాగుతున్న పోరులో గాజా స్ట్రిప్ నలిగిపోతోంది. గాజా నుంచే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై రాకెట్లు ప్రయోగించడంతో ఆ దేశం దీన్ని టార్గెట్ చేసింది. ఈ ప్రాంతానికి తాగు నీరు, కరెంటు, వైద్య సౌకర్యాలు అందకుండా చేస్తోంది. ఇంతటితో సరిపెట్టకుండా గాజాను భూమార్గంలో టార్గెట్ చేస్తోంది. అదే సమయంలో నిన్న గాజాలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రిపై బాంబుదాడి కూడా జరిగింది. ఇది మీరు చేశారంటే మీరేనంటూ ఇజ్రాయెల్, హమాస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పర్యటన వేళ జరిగిన ఈ బాంబు దాడితో అరబ్ దేశాలు ఆయనతో జరగాల్సిన భేటీని రద్దు చేసుకున్నాయి. అదే సమయంలో బైడెన్ కూడా తమ మిత్రుడు ఇజ్రాయెల్ కు అండగా నిలుస్తూ గాజాలో బాంబుదాడి వేరెవరో చేశారంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాటు గాజాకు మానవతా కారిడార్ ఏర్పాటుకు అనుకూలంగా ఇవాళ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

గాజా స్ట్రిప్కు మానవతా సహాయాన్ని అనుమతించడానికి, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదానికి విరామం ఇవ్వడానికి పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా ఇవాళ వీటో చేసింది. దీంతో భద్రతా మండలి శాశ్వత సభ్యదేశమైన అమెరికా నిర్ణయం గాజాకు శరాఘాతంగా మారబోతోంది.
ఇప్పటికే అరబ్ దేశాలతో పాటు పలు ముస్లిం దేశాలు, ఐక్యరాజ్యసమితి కూడా గాజాకు అవసరమైన సాయం అందించేందుకు మానవతా కారిడార్ ఏర్పాటు చేయాలని గట్టిగా కోరుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా తీసుకున్న నిర్ణయం వారికి మింగుడు పడటం లేదు.
ఇవాళ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీని రద్దు చేసుకున్న అరబ్ దేశాలు .. ఇప్పుడు ఐరాసలో గాజాకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఆ దేశం విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ఇన్నాళ్లూ ముస్లిం దేశాలకు దగ్గరయ్యేందుకు బైడెన్ చేస్తున్న ప్రయత్నాలకు సైతం ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications