Pfizer: పిల్లలకూ కరోనా టీకా: వ్యాక్సినేషన్లో తిరుగులేని అగ్రరాజ్యం: ముందుచూపుతో
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించే చర్యల్లో అగ్రరాజ్యం అమెరికా దూసుకెళ్తోంది. ఇప్పటికే 160 మిలియన్ అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. జో బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వంద రోజుల నాటికి 200 మిలియన్ల మందికి టీకాలను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీన్ని అందుకోవడానికి అక్కడి పాలనా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నింటికీ అనుమతి ఇచ్చింది.
రెండోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అమెరికా శ్రీకారం చుట్టబోతోంది. ఈ దశలో 12 నుంచి 15 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకూ టీకాలను అందించబోతోంది. దీనికోసం ఫైజర్-బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారిని నిర్మూలించే దిశగా తాము సాగిస్తోన్న పోరాటంలో మరో కొత్త దశ ప్రారంభమైందని ఎఫ్డీఏ కమిషనర్ జెనెట్ వుడ్కాక్ పేర్కొన్నారు.
యూఎస్లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఫైజర్-బయోఎన్టెక్ టీకాను వినియోగిస్తోంది జో బిడెన్ ప్రభుత్వం. 16 సంవత్సరాలకు పైనున్న వయస్సున్న వారికి మాత్రమే ఇప్పటిదాకా ఈ టీకాను అందిస్తూ వచ్చింది. మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లకూ ఎఫ్డీఏ ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా- ఫైజర్ వ్యాక్సిన్ నిల్వలు భారీగా చేరుకుంటుండటంతో.. మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఫైజర్-బయోఎన్టెక్ ఇదివరకే దాఖలు చేసిన అప్లికేషన్ను ఆమోదించింది.
12-15 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకు అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ వినియోగించడానికి అనుమతి ఇచ్చినట్లు వుడ్కాక్ తెలిపారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో 11 నుంచి 17 సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలు 1.5 మిలియన్ల మంది ఉన్నారు. గత ఏడాది మార్చి 1వ తేదీ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ వరకు నమోదైన కేసుల్లో 1.5 మిలియన్ల మంది ఈ వయస్సు ఉన్న వారేనని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవేన్షన్ వెల్లడించింది.
Recommended Video
కరోనా వైరస్ పెను ప్రభావాన్ని చూపిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు..మరణాల్లోనూ టాప్లో ఉంటోంది. ఇప్పటిదాకా 3,35,15,308 పాజిటివ్ కేసులక్కడ నమోదయ్యాయి. 5,96,179 మంది మరణించారు. వైరస్ తొలిదశలోనే ఆ దేశం అప్రమత్తమైంది. ముందుచూపుతో వ్యవహరించగలిగింది. వైద్య రంగాన్ని బలోపేతం చేసుకోగలిగింది. వ్యాక్సిన్ల కొరత లేకుండా చూడగలిగింది. కరోనా సెకెండ్ వేవ్ ప్రభావం అమెరికాపై నామమాత్రంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం.