Afghanistan: అక్కడి పరిస్థితి 'కాబూల్' కన్నా అతి దారుణం-వేల జనంతో కిక్కిరిసి-దేశం దాటి పారిపోయేందుకు...
ఆఫ్గనిస్తాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. స్వేచ్చా,హక్కులు లేని తాలిబన్ల పాలనలో బతకడం కంటే ఇతర దేశాలకు పారిపోవడమే ఉత్తమమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అవకాశం దొరికితే ఆ నాలుగు కోట్ల మంది శరణార్థులుగా ఇతర దేశాల్లో ఉండిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అంత జనాభాకు ఆశ్రయమివ్వడం సాధ్యమేనా... అంతర్జాతీయ సమాజపు మద్దతు కరువైన వేళ... ఆఫ్గన్ల భవిష్యత్ అంధకారమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆఫ్గన్-పాక్ బోర్డర్ వద్ద పరిస్థితి ఇలా...
ప్రస్తుతం మీడియా ఫోకస్ ఉన్న కాబూల్ విమానాశ్రయం వద్ద పరిస్థితి తప్పితే... ఆఫ్గనిస్తాన్లోని మిగతా చోట్ల పరిస్థితి ఏవిధంగా ఉందనేది ఎవరికీ తెలియదు. తాజాగా నతిక్ మాలిక్జాదా అనే ఓ జర్నలిస్ట్ ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్ బోర్డర్లో నెలకొన్న పరిస్థితికి సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించేందుకు వేలాది మంది జనం అక్కడ గుమిగూడటం వీడియోలో గమనించవచ్చు.'ఇది కాబూల్ విమానాశ్రయం కాదు. ఇది స్పిన్ బోల్దక్లోని ఆఫ్గన్-పాక్ బోర్డర్. వేలాది మంది ఆఫ్గన్లు దేశం వీడి పాకిస్తాన్లో ప్రవేశించేందుకు చూస్తున్నారు. కాబూల్ విమానాశ్రయం కన్నా ఇక్కడి పరిస్థితి మరింత దారుణం ఉంది. కాకపోతే ఇక్కడ విదేశీ భద్రతా బలగాలేవీ లేవు కాబట్టి... మీడియా ఫోకస్ లేదు.' అని నతీక్ మాలిక్జాదా పేర్కొన్నారు.

అదే జరిగితే పరిస్థితి మరింత ఆందోళనకరం...
తాలిబన్లు ఆఫ్గనిస్తాన్ను పూర్తిగా ఆక్రమించుకున్నాక పొరుగు దేశాలు భౌగోళిక సరిహద్దులను మూసివేశాయి. దీంతో కాబూల్ విమానాశ్రయం ఒక్కటే ఆ దేశం నుంచి పారిపోయేందుకు ఉన్న ప్రస్తుత ఏకైక మార్గం. అందుకే వేల సంఖ్యలో జనం అక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. నిజానికి భౌగోళిక సరిహద్దులు తెరిచి ఆఫ్గన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసినప్పటికీ... పాకిస్తాన్,తజికిస్తాన్ తదితర దేశాలేవీ సరిహద్దులను తెరవలేదు. తాలిబన్ల రాకతో ఆఫ్గన్ ఇప్పటికే అస్తవ్యస్తంగా తయారైంది. ఇంకొద్ది రోజులు పోతే ఆహారం,తాగునీటికి కూడా అక్కడి ప్రజలు అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే వారి పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆగస్టు 31 డెడ్ లైన్..
మరోవైపు కాబూల్ విమానాశ్రయంపై ఐసిస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలు దాడులు జరగవచ్చుననే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 31 లోపు అమెరికన్లను అక్కడి నుంచి తరలించాలని అమెరికా భావిస్తోంది. భద్రతా బలగాలు సహా ఆఫ్గన్లో చిక్కుకుపోయిన అమెరికన్లందరినీ ఆలోపు తరలించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. యూకె లాంటి దేశాలు గడువును పొడగించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ బైడెన్ అందుకు అంగీకరించలేదు. గడువు లోగా అమెరికా ఆఫ్గన్ను వీడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాలిబన్లు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా,నాటో దళాలు అక్కడి నుంచి తప్పుకున్న తర్వాత ఇతర దేశాలు తరలింపు చర్యలు చేపట్టడం అసాధ్యమనే చెప్పాలి.
Recommended Video

సమర్థించుకున్న బైడెన్... ఆఫ్గన్లకు నో ఆప్షన్...
ఆఫ్గనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణను బైడెన్ ఇప్పటికే సమర్థించుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్గనిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమో,లేక ఆ దేశాన్ని పునర్నిర్మించడమో తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. ఆఫ్గనిస్తాన్ విముక్తి పోరాటం ఆ దేశ ప్రజల చేతుల్లోనే ఉందని తేల్చి చెప్పారు. తమది కాని పోరాటంలో అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం తాను కోరుకోవట్లేదన్నారు. సైన్యం ఉపసంహరణకు సరైన రోజు,సందర్భం అంటూ ఉండదని వ్యాఖ్యానించారు. దీంతో తాలిబన్లను ఎదుర్కోవడమా,పారిపోవడమా,లేక వారి పాలనలోనే మగ్గిపోవడమా అనేది ఆఫ్గన్లే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications