క్రమశిక్షణ: మూడు నిమిషాలు ముందు లేచాడని సగం రోజు జీతం కట్
ఉద్యోగం చేస్తూ భోజనం చేసేందుకు మూడు నిమిషాల ముందు వెళ్లాడంటూ ఓ ఉద్యోగి సగం రోజు జీతం కట్ చేసిన ఘటన జపాన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జపాన్లోని కోబె నగరంలో వాటర్ వర్క్స్ బ్యూరోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి చాలా ఆకలేసిందో ఏమో తెలియదు కానీ... కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా మూడు నిమిషాల ముందే భోజన విరామం తీసుకుని అడ్డంగా బుక్కయ్యాడు.
సాధారణంగా ఆ కంపెనీ నిబంధనల ప్రకారం భోజన విరామం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉంటుంది. అయితే సదరు ఉద్యోగి కేవలం మూడు నిమిషాల ముందే తను పని చేస్తున్న డెస్క్ నుంచి లేచి భోజనానికి వెళ్లినందుకు సగం రోజు జీతం కట్ చేసింది సదరు కంపెనీ. అంతేకాదు మూడు నిమిషాల ముందు భోజనానికి వెళ్లినందుకు ఆ కంపెనీ బాస్ ఆ ఉద్యోగి తరపున క్షమాపణలు చెప్పాడు. క్రమశిక్షణ తప్పినందుకు క్షమించాల్సిందిగా కాన్ఫ్రెన్స్లో బాస్ వేడుకున్నాడు.
ఈ వార్త అక్కడ సోషల్ మీడియాలో దావణంలా పాకింది. అంతే ఇక నెటిజెన్లు ఎవరి వెర్షన్ వారు వినిపించారు. కొందరు బాస్ నిర్ణయాన్ని సమర్థించగా మరికొందరు ఇదెక్కడి చోద్యం అంటూ ట్వీట్ చేశారు. ఆ కంపెనీలో పనిచేసేవారు కనీసం వాష్రూం కూడా వెళ్లరేమో అంటూ మరికొందరు ఛలోక్తులు విసిరారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ కంపెనీకి సంబంధించిన ఓ ఉద్యోగి పనివేళ్లల్లో భోజనం పార్శిల్ తెచ్చుకునేందుకు బయటకు వెళుతున్నాడన్న సంగతి తెలుసుకున్న యాజమాన్యం అతన్ని సస్పెండ్ చేసింది. ఇలా భోజనానికి అని వెళ్లిన ఉద్యోగి ఆరు నెలల్లో మొత్తం 55 గంటలు పని సమయాన్ని వృథా చేశాడని కంపెనీ గుర్తించింది.