మళ్లీ కెమికల్ అటాక్ యత్నాలు, పసిగట్టిన అగ్రరాజ్యం, సిరియాపై సీరియస్
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మరోమారు ఘోర రసాయనిక దాడికి సిద్ధమవుతున్నట్టు వైట్ హౌస్ పేర్కొంది. ఒకవేళ ఆయన ఈ దాడికి పాల్పడితే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మరోమారు ఘోర రసాయనిక దాడికి సిద్ధమవుతున్నట్టు వైట్ హౌస్ పేర్కొంది. ఒకవేళ ఆయన ఈ దాడికి పాల్పడితే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
సోమవారం రాత్రి వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ మేరకు సిరియా అధ్యక్షుడికి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మొన్న ఏప్రిల్ లో సిరియాలో జరిగిన రసాయనిక దాడికి అమాయకులైన పౌరులు, చిన్నారులు బలైన సంగతి తెలిసిందే.
ఈ రసాయనిక దాడిలో ముక్కుపచ్చలారని పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఎక్కువగా ఏ పాపం తెలియని చిన్నారులే ఉన్నారు.
అలాంటి సన్నాహాలే ప్రస్తుతం సిరియాలో జరుగుతున్నాయని గుర్తించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ చెప్పారు. అసద్ పరిపాలనలో మరో భారీ రసాయనిక వాయువుల దాడి జరుగబోతుందని, ఇది భారీ మొత్తంలో ప్రజలను బలితీసుకోనుందని ఆయన తెలిపారు.
ఇదే రకమైన కార్యకలాపాలు 2017 ఏప్రిల్ 4 కు ముందు కూడా చేపట్టారని సీన్ స్పైసర్ పేర్కొన్నారు. ఒకవేళ మళ్లీ బషర్ అల్-అసద్ గనుక ఇలాంటి దాడికి పాల్పడితే ఆయన, ఆయన సైన్యం భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పైసర్ హెచ్చరించారు.
ఏప్రిల్ లో కెమికల్ అటాక్ జరిగినప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా స్పందించారు. వెంటనే అసద్ కంట్రోల్ లో ఉన్న ఎయిర్ ఫీల్డ్ పై దాడులు చేపట్టారు.