Ali Larijani: ఇరాన్ వార్ లో బిగ్ టర్న్-ఎవరీ లారిజానీ ? ఎందుకంత కీలకం ?
ఇరాన్ వార్ రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా ఇరాన్ జాతీయ భద్రతాధిపతి అలీ లారిజానీని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత కూడా ఆ దేశం కనబరుస్తున్న అసామాన్య పోరాట తీరు వెనుక ఉన్న కీలక వ్యక్తి లారిజానీ. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇజ్రాయెల్ హత్య చేయడంతో ఇరానియన్లు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు లారిజానీ ఎవరు ?, ఆయన హత్య ఇజ్రాయెల్ కు ఎందుకంత కీలకంగా మారిందో ఓసారి చూద్దాం..
అలీ లారిజానీ ఎవరు? (Ali Larijani)
సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత ఇరాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన 67 ఏళ్ల అలీ లారిజానీ, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించారు. ప్రస్తుతం ఇరాన్ సర్వోన్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నారు. అలాగే యుద్ధంలో ఇరాన్ ను నడిపిస్తున్న కీలక నాయకులలో ఒకరిగా ఉన్నారు. లారిజానీ చివరిసారిగా టెహ్రాన్లో జరిగిన అల్-ఖుద్స్ దినోత్సవ పరేడ్లో బహిరంగంగా కనిపించారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ లో చనిపోయిన అత్యున్నత అధికారి కూడా ఆయనే.

ఖమేనీ తర్వాత కీలక వ్యక్తి
ఇరాన్ ప్రభుత్వంలో లారిజానీ ఒక ప్రశాంతమైన, ఆచరణాత్మక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమేనీ మరణం తర్వాత భద్రతా నిర్ణయాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే దేశాన్ని పర్యవేక్షిస్తున్న ముగ్గురు సభ్యుల తాత్కాలిక నాయకత్వంలో ఒకరు. ఆయనకు ఇరాన్ విప్లవవాద ఉన్నత వర్గాలతో బలమైన సంబంధాలు ఉండేవి. 20 ఏళ్ల వయసులో, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రుహొల్లా ఖొమేనీకి సన్నిహితుడైన, ప్రభావవంతమైన మత గురువు మోర్టెజా మోతహరి కుమార్తె అయిన ఫరీదే మోతహారిని ఆయన పెళ్లి చేసుకున్నారు.
గణిత మేథావి
చాలా మంది ఇరాన్ కఠినవాదుల్లా కాకుండా, లారిజానీకి బలమైన విద్యా నేపథ్యం ఉంది. షరీఫ్ విశ్వవిద్యాలయం నుండి మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయం నుండి పాశ్చాత్య తత్వశాస్త్రంలో మాస్టర్స్ , పిహెచ్డి చేశారు. జర్మన్ తత్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్పై డాక్టరేట్ పరిశోధన చేశారు. 1980ల ప్రారంభంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్లో చేరిన లారిజానీ..ఆ తర్వాత అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సంజానీ హయాంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా, ప్రభుత్వ ప్రసార సంస్థ ఐఆర్ఐబి అధిపతిగా, సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి, ప్రధాన అణు సంధానకర్త, పార్లమెంట్ స్పీకర్ గా పనిచేశారు.
అణు చర్చలు, రాజకీయాలు
లారిజానీ పశ్చిమ దేశాలతో దౌత్యానికి మద్దతు ఇచ్చారు. 2015 అణు ఒప్పందానికి సహకరించారు. దీనితో ఆయనకు చర్చలకు సిద్ధంగా ఉన్న సంప్రదాయవాదిగా పేరు వచ్చింది. 2005, 2021, 2024లో ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. కానీ తర్వాతి ప్రయత్నాలలో గార్డియన్ కౌన్సిల్ చేత అనర్హుడిగా ప్రకటించబడ్డారు. 2025 ఆగస్టులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆయనను సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా తిరిగి నియమించారు. యుద్ధానికి ముందు వారాలలో, లారిజాని ఒమన్ ద్వారా అమెరికాతో పరోక్ష చర్చలలో పాల్గొన్నారని, ఇజ్రాయెల్ ఒక పెద్ద యుద్దాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరించారని సమాచారం. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ, ఇతర ఉన్నతాధికారులతో పాటు లారిజానీపై సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్ల వరకు బహుమతిని గత వారం అమెరికా ప్రకటించింది.

లారిజానీ మరణంతో ఇరాన్ పై ప్రభావం
లారిజానీ ఒక యుద్ధ వ్యూహకర్ర్త కావడం, ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలు జరపగల కొద్దిమంది అంతర్గత వ్యక్తులలో ఒకరిగా ఉండటంతో ఆయన మరణం ఇరాన్ నాయకత్వానికి పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే దేశంలోని అన్ని స్ధాయిల్లో ఉన్న సైనిక, రాజకీయ నాయకులతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మరణంతో ఇరాన్ వార్ పై తీవ్ర ప్రభావం పడే అస్కారం ఉంది.












Click it and Unblock the Notifications