భారత్కు అత్యవసర సాయం: జో బిడెన్: ఇతర దేశాలకు 60 బిలియన్ డోసుల వ్యాక్సిన్
వాషింగ్టన్: భారత్కు అత్యవసర సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. కరోన వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కఠినతర పరిస్థితుల నుంచి ఆ దేశం త్వరలోనే కోలుకుంటుందని, దీనికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని అన్నారు. గత ఏడాది కరోనా వైరస్ ఆరంభమైన తొలిరోజుల్లో దాని వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను అనుసరించిందో భారత్ కూడా అలాంటి చర్యలనే తీసుకుంటోందని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సాగించిన సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణ వివరాలను బ్లింకెన్ స్వయంగా వెల్లడించారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ను సొంతంగా తయారు చేసుకోవడానికి అవసరమైన విడి పరికరాలు, ఇతర యంత్రాలను తాము భారత్కు పంపిస్తున్నట్లు చెప్పారు. వైద్యరంగంలో అపారమైన అనుభవం ఉన్న నిపుణులు భారత్లో ఉన్నారని, కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి ఆ దేశం త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
నోవావ్యాక్స్ (Novavax) వంటి ఇతర టీకాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని అన్నారు. అమెరికా సమీప భవిష్యత్లో వ్యాక్సిన్లో స్వీయ స్వావలంబనను సాధిస్తుందని బిడెన్ స్పష్టం చేశారు. ఆ తరువాతే- ఇతర దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని అన్నారు. కనీసం 60 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను ఇతర దేశాలకు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బిడెన్ పేర్కొన్నారు.
కోవాక్స్ (Covax)ను ఉత్పత్తిని వేగవంతం చేయడానికి రెండు బిలియన్ డాలర్లను కేటాయించామని స్టేట్స్ సెక్రెటరీ ఆంటని బ్లింకెన్ వెల్లడించారు. వచ్చే ఏడాది మరో రెండు బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. కోవ్యాక్స్ అందుబాటులోకి రావడం వల్ల ఇతర దేశాలకు పెద్ద ఎత్తున వాటిని అందజేయడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. కంట్రీ టు కంట్రీ వ్యాక్సిన్ అందజేసేలా ఏర్పాట్లను చేయాల్సి ఉందని ఆంటోని బ్లింకెన్ చెప్పారు.