డొనాల్డ్ ట్రంప్ వస్తే భారత ఉద్యోగులకు ఎసరే?
న్యూయార్క్: రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ముందు వరుసలో కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆపడం లేదు. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన దృష్టి ఇప్పుడు భారత్పై పడింది. అమెరికాలో భారత్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చినవారు ఇక్కడి ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
లాస్వేగాస్లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు కొల్లగొడుతున్నారని, తాను అధ్యక్ష పదవిలోకి వస్తే ఆ ఉద్యోగాలన్నీ తిరిగి తెస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ గెలిస్తే అమెరికాలో భారతీయుల ఉద్యోగాలకు ఎసరు పెడతారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా గత జూన్లో బరిలోకి దిగిన ఆయన చైనా, జపాన్, మెక్సికో, వియత్నాం వాసులు అమెరికన్ల ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నారని ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఆ దేశాల జాబితాలో ట్రంప్ భారత్ని కూడా చేర్చడం, వెంట వెంటనే రెండుసార్లు ఆ విషయం ప్రస్తావించడంతో భారతీయ ఉద్యోగుల్లో కొంత ఆందోళన పరిస్థితి నెలకొంది. అయితే, ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడు అయినప్పుడే కదా! అని కొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమలయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.