IPL Auction 2022: లైవ్ టెలికాస్ట్ ఛానల్ ఇదే.. ప్రీతిజింతా గైర్హాజర్
బెంగళూరు: ఎప్పుడెప్పుడా అంటూ క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2022, 15వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్లో ఆడబోయే క్రికెటర్ల కోసం మెగా వేలంపాటకు ముహూర్తం సమీపించింది. ఈ మధ్యాహ్నమే ఆరంభం కానుంది. 12 గంటలకు ఈ మెగా ఈవెంట్ కోసం సర్వం సిద్ధమైంది. బెంగళూరు- దీనికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఇక్కడి ఐటీసీ గార్డెనియాలో వేలంపాట ఏర్పాటైంది. ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇందులో 10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోతోన్నాయి.
వేలానికి ఎంతమంది..
మొత్తంగా ఈ వేలంపాటలో 590 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1200 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. దాన్ని వడపోశారు. మెరికల్లాంటి వానికి ఆక్షన్ కోసం సెలెక్ట్ చేశారు. ఈ 590 మందిలో 228 మంది క్యాప్డ్, 355 మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్తో అసోసియేట్ అయిన ఏడు దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
భారత క్రికెటర్ల సంఖ్యే ఎక్కువ..
ఈ 590లో 370 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. కాగా మిగిలిన 220 మంది విదేశీ ప్లేయర్లు. హయ్యెస్ట్ రిజర్వ్ ప్రైస్ రెండు కోట్ల రూపాయలు. ఈ రెండు కోట్ల రూపాయల మార్జిన్లో 48 క్రికెటర్లు ఉన్నారు. కోటిన్నర రూపాయల మార్జిన్లో 20, కోటి రూపాయల రిజర్వ్ ప్రైస్ కేటగిరీలో 34 మంది క్రికెటర్లు ఉన్నారు.
10 ఫ్రాంఛైజీ సందడి..
ఐపీఎల్ 2022 మెగా టోర్నమెంట్లో పాల్గొనే ఫ్రాంఛైజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి. పాత ఫ్రాంఛైజీలు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి హాజరు కానున్నాయి. రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి.
లైవ్ టెలికాస్ట్ ఛానల్ ఇదే..
రెండు రోజుల పాటు కొనసాగే ఈ మెగా వేలంపాటను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీని పరిధిలోని ఎనిమిది నెట్వర్క్ ఛానల్స్, మూడు ప్రాంతీయ భాషల్లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుందీ పే-డే ప్రోగ్రామ్. హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాట్ఫామ్పైనా లైవ్ టెలికాస్ట్ను చూసే వీలు ఉంది. ఈ ఉదయం 11 గంటలకు కవరేజ్ ఆరంభమౌతుంది. 12 గంటలకు వేలంపాట మొదలవుతుంది.
33 మంది ప్లేయర్లు రిటైన్..
అన్ని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మొత్తంగా 33 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఒక్కో ఫ్రాంఛైజీ 900 కోట్ల రూపాయల బడ్జెట్ను దీనికోసం కేటాయించుకున్నాయి. రిటైనింగ్ ప్లేయర్లకు చెల్లించాల్సిన మొత్తం పోగా.. 561.5 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో మిగిలిన క్రికెటర్లందరినీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. ఐపీఎల్ మెగా వేలానికి సన్నద్ధం అయ్యాయి.
ప్రీతిజింతా గైర్హాజర్..
ఈ మెగా వేలం పాటకు సాధారణంగా అన్ని ఫ్రాంఛైజీలకు చెందిన ఓనర్లు హాజరవుతుంటారు. హెడ్ కోచ్ సహా కనీసం అయిదుమంది ఈ వేలంలో పాల్గొంటుంటారు. తమకు నచ్చిన ప్లేయర్ను సెలెక్ట్ చేసుకుంటుంటారు. ఈ వేలంపాటకు పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతిజింతా డుమ్మా కొట్టనున్నారు. ఈ మెగా ఈవెంట్కు హాజరు కావట్లేదు. ఈ విషయాన్ని ఆమె తన అఫీషియల్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై పోస్ట్ చేశారు. అటెండ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించారు.
కవల పిల్లలను వదిలి రావడం మనసొప్పక..
ప్రస్తుతం ప్రీతిజింతా తన భర్త జీన్ గుడెనఫ్తో కలిసి అమెరికాలో నివసిస్తోన్నారు. గత ఏడాది నవంబర్లో ప్రీతిజింతా సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. ఇంట్లో నాలుగు నెలల కవల పిల్లలను వదిలేసి, బెంగళూరుకు ట్రావెల్ చేయలేనని స్పష్టం చేశారు. ఐపీఎల్ మెగా వేలం ఈవెంట్ను మిస్ అవుతున్నానని చెప్పారు. అయినప్పటికీ- దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని అన్నారు. ప్లేయర్ల సెలెక్షన్పై ఫ్రాంఛైజీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించాననీ పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు వేలానికి అనిల్ కుంబ్లే లీడ్ చేస్తారు.
ఫస్ట్ డే 161 మంది..
తొలి రోజు మెగా వేలంపాటలో 161 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కోట్ల రూపాయల రిజర్వ్ ప్రైస్గా ఉన్న ప్లేయర్లు చాలామందే ఉండనున్నారు. ప్రత్యేకించి- డైనమిక్ బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఏస్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీతో పాటు విదేశీ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డికాక్, ఫాఫ్ డుప్లెసిస్, కగిసొ రబడ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నారు.