ఇక్కడ జగన్ - అక్కడ కేసీఆర్: ఇద్దరికీ చేతినిండా పని
జగిత్యాల: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. రాజకీయ వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి సరిగ్గా ఏడాది సమయం మిగిలివున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికార టీఆర్ఎస్.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.

డిసెంబర్ 4న..
ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. డిసెంబర్ 4వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఆయన పూరిస్తారనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనున్నారు.

సత్తా చాటేలా..
కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. లక్ష మందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరలింపు కోసం సమాయాత్తమౌతోన్నారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లుగా భావిస్తోన్న ఈ సభలో కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తి రేపుతోంది.

అభివృద్ధి పనులకు..
తన మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా కేసీఆర్ కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పాత కలెక్టరేట్ స్థలంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మినీ ట్యాంక్బండ్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఇక జగిత్యాల టూర్..
మహబూబ్ నగర్ జిల్లా పర్యటన ముగిసిన తరువాత రెండు రోజుల వ్యవధిలో జగిత్యాల పర్యటన చేపట్టనున్నారు. ఈ సభ విజయవంతం చేయడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. ఈ సభను విజయవంతం చేసే బాధ్యతలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీసుకున్నారు. రెండు లక్షల మంది ప్రజలను సమీకరించాల్సి ఉంటుందని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కేసీఆర్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండనున్నాయి.

లేదంటూనే ముందస్తుకు..
అసెంబ్లీ ఎన్నికలపై కేసీఆర్ ఇదివరకే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీన తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. ముందస్తుకు వెళ్లదలచుకోలేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టామనీ అన్నారు. అక్టోబర్ 2023 తరువాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడొచ్చనే సంకేతాలు ఇచ్చారాయన. అయినప్పటికీ- ముందస్తు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ప్రజలకు అందుబాటులో..
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వచ్చే 10 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. 2023 డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు బహిరంగ సభల్లో ప్రసంగించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు.

అదే మూడ్లో జగన్ కూడా..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం జిల్లాల పర్యటనలతో బిజీగా ఉంటోన్నారు. వరుస పర్యటనలకు ఆయన శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించిన ఆయన రెండు రోజుల వ్యవధిలోనే శ్రీకాకుళానికి వెళ్లారు. నరసన్నపేటలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నెల చివరన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి వెళ్లనున్నారు. నిజానికి- శుక్రవారమే జగన్.. మదనపల్లిలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ.. అది ఈ నెలాఖరుకు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications