రూ.15 లక్షల దొంగ నోట్లు.. మార్చేందుకు వచ్చి పట్టుబడిన ముఠా..
ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటించినా సరే.. దొంగనోట్లు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు.. కానీ టైర్-3,4 నగరాలకు కూడా నోట్లు సరఫరా అవుతన్నాయి. జగిత్యాల పట్టణంలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. దొంగ నోట్ల ముఠా వచ్చిందనే సమాచారం అందుకున్న పోలీసులు... కొత్త బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా కన్పించిన అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేయగా విషయం బయట పడింది.
దొంగ నోట్లను మార్చేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారి దగ్గరి నుంచి 15 లక్షల దొంగనోట్లు, 3 లక్షల అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాల్లపెట్ గ్రామానికి చెందిన మేక శేఖర్, జన్నారం మండలం పుట్టిగూడకు చెందిన రాధాకిషన్, గోదావరిఖనిలో ఉండే సిద్దిపేట జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్, హనుమకొండకు చెందిన విజ్జగిరి శ్రీకాంత్, విజ్జగిరి బిక్షపతి అనే ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ నుంచి తెచ్చిన దొంగనోట్లను మార్చేందుకు జగిత్యాలకు వచ్చారని పోలీసులు వెల్లడించారు.
మేక శేఖర్ దొంగ నోట్ల చలామణిలో పాత నిందితుడు.. మిగతా వారు కొత్త వారు అని తెలిపారు. శేఖర్పై గతంలో ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా దొంగ నోట్లతో ఎంతమంది మోసం చేశారు? ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు? అసలు ఈ దొంగ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.