పవన్ మామయ్య చెప్పారు: రాజకీయాల్లో ప్రవేశంపై తేల్చిసిన సాయి ధరమ్ తేజ్
కడప: ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్.. ఇవ్వాళ రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి వచ్చారు. శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆయా ఆలయాల కమిటీ ప్రతినిధులు సాయి ధరమ్కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలను అందించారు.
అనంతరం కడపలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సందర్శించారు. దర్గా ప్రతినిధులు ఆయనకు పూల మాల వేసి ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధమైన కాషాయ తలపాగాను ధరింపజేశారు. కండువాను మెడలో వేసుకున్నారు. అరగంట పాటు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు సాయి ధరమ్ తేజ్.

సాయి ధరమ్ తేజ్ కడపలో ప్రత్యక్షం కావడం పట్ల అభిమానుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా చేసింది. ఆయన వచ్చారనే సమాచారం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున స్థానికులు అమీన్ పీర్ దర్గాకు చేరుకున్నారు. చూడటానికి ఎగబడ్డారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకోకుండా కడప పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
సాయిధరమ్ ప్రస్తుతం బ్రో సినిమాలో నటిస్తోన్నారు. కేతిక శర్మ హీరోయిన్. విరూపాక్ష సూపర్ హిట్ తరువాత రాబోతోన్న ఇది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతమ్కు ఇది రీమేక్. సముద్ర ఖని దర్శకుడు. తన మేనమామ పవన్ కల్యాణ్తో స్క్రీన్ను షేర్ చేసుకున్నారు సాయి ధరమ్ తేజ్. వారిద్దరూ కలిసి నటించిన సినిమా కావడం వల్ల హైప్ క్రియేట్ అయింది ఈ మూవీపై. ఈ నెల 28వ తేదీన విడుదల కాబోతోంది.
పెద్ద దర్గాను దర్శించిన అనంతరం సాయిధరమ్ తేజ్ విలేకరులతో మాట్లాడారు. గతంలో తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఆ ప్రమాదం నుంచి దేవుడి దయ వల్ల గట్టెక్కగలిగానని, ఇది తనకు పునర్జన్మ అని వ్యాఖ్యానించారు. తనకు పునర్జన్మను ప్రసాదించినందు వల్ల ఆలయాలను సందర్శిస్తున్నానని అన్నారు.

రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాయిధరమ్. పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే రాజకీయ రంగప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారని అన్నారు. ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని తేల్చి చెప్పారు. సినీ రంగంలోనే ఉంటానని మామయ్యకు చెప్పానని, రాజకీయాలపై అవగాహన ఏర్పరచు కోవాల్సి ఉందని అన్నారు.
బ్రో సినిమాలో పవన్ మామయ్యతో కలిసి నటించడం మరువలేని అనుభూతిగా అభివర్ణించారు సాయిధరమ్. మామయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మామయ్య పవన్ అంటే తనకు ప్రాణంతో సమానమని పేర్కొన్నారు. ఆయన రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటోన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications