నాకేం జరిగినా జగన్ దే బాధ్యత: బీజేపీకి రాజీనామా చేస్తానంటూ ఆదినారాయణ రెడ్డి సంచలనం
కడప: తనకు ఏదైనా జరిగితే సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి అన్నారు. తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడారు.

అవసరమైతే బీజేపీకి రాజీనామా చేస్తా..
రాష్ట్రంలో, జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థులకు ఏదైనా హాని జరిగితే తనదే బాధ్యత అని, అవసరమైతే బీజేపీకి రాజీనామా చేసైనా సరే పోరాడతామని తేల్చిచెప్పారు. మార్చి 14న బీజేపీ అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు దేవగుడికి వచ్చిన వారిని తమ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. ఇందుకు విరుద్ధంగా తామే దాడి చేశామంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

దాడి చేశారంటూ ఆదినారాయణ రెడ్డిపై కేసు
కాగా, ఆదినారాయణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలపై దాడి ఘటనలో కేసు పెట్టినట్టు జమ్మలమడుగు పోలీసులు తెలిపారు. దేవగుడిలో రోడ్డుపై ఉండగా.. తమను ఆది నారాయణరెడ్డి అనుచరులు లోపలికి తీసుకెళ్లి మరీ దాడి చేశారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదినారాయణ, ఇతరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
Recommended Video

వైసీపీ నేతల ఫిర్యాదు..
శనివారం రాత్రి దేవగుడిలో ప్రధాన రోడ్డుపై ఉన్న తమను ఆది నారాయణరెడ్డి అనుచరులు అతని వద్దకు తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఎం రెడ్డయ్య, ఆయన సోదరుడు రామాంజనేయులు తెలిపారు. అక్కడ ఆది నారాయణ రెడ్డి సహా ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, దేవగుడి జయరామిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి సహా మరో 80 మంది వరకు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ తమపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రెడ్డయ్యను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెడ్డయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు జమ్మలమడుగు అర్బన్ సీఐ మధుసూదన్ రావు ఆదివారం రాత్రి మీడియాకు వివరించారు. కాగా, ఎమ్మెల్సీ శివనాథరెడ్డితో మరికొందరుపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications