సొంత జిల్లాకు వైఎస్ జగన్: మూడు రోజుల పాటు అక్కడే
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాళ కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం ఇదివరకే విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. మరి కొన్నింటిని ప్రారంభిస్తారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. 2.20 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2.30కు ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3:20 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు హెలికాప్టర్లో నేరుగా వేముల మండలం వేల్పులకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు స్థానిక నాయకులతో సమావేశమవుతారు.
4.10 నుంచి 5.10 నిమిషాల మధ్య వేల్పుల గ్రామ సచివాలయం కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అమ్జాద్ భాషా, రవీంద్రనాథ్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇందులో పాల్గొంటారు. సాయంత్రం 5.15 నిమిషాలకు వేల్పుల నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 5.35 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
శుక్రవారం ఉదయం 8.50 నిమిషాలకు వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పిస్తారు. 9 గంటల నుంచి 9.40 నిమిషాల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం ఇడుపులపాయలో తన సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. ఎల్లుండి ఉదయం 8.50 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కడప చేరుకుంటారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.