రౌడీలతో రాజకీయం చేసే నీకే అంతుంటే, పిచ్చి వేషాలు వేస్తే పీకేస్తా: జగన్పై పవన్ కళ్యాణ్
కడప: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం కడపలోని అన్నమయ్య కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. కడప జిల్లాలో కొందరు నేతల రౌడీయిజానికి, దౌర్జన్యానికి కాలం చెల్లిందని, వారి కోటలు బద్దలు కొట్టడానికి జనసేన వస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
వేల కోట్లు దోచిన ప్రజలను బానిసలుగా చూస్తావా
వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రజలను బానిసలుగా చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని జగన్ పైన పరోక్షంగా నిప్పులు చెరిగారు. నేత జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ పాత్రను జనసేన పోషిస్తోందన్నారు. రౌడీమూకలు, ప్రయివేటు సైన్యంతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరూ భయపడే వారు లేరన్నారు. తాను సీఎం కావాలనుకుంటే నిలువరించే దమ్ము ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి, సీమకు స్వేచ్ఛ ఇవ్వడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
జగన్ ఎంతమందిని భయపెట్టగలవు
మార్పు రావాలి, అవినీతి పై పోరాడాలి దానికి అందరూ ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమ వెనక్కి నెట్టబడిన ప్రాంతమని చెప్పారు. మార్పు వస్తుందని, అలా మార్పు వచ్చిన రోజున ఎంత మందిని మీరు భయపెట్టగలరని జగన్ను ఉద్దేశించి నిలదీశారు. ఈ రోజున ఇంతమంది యువత రోడ్ల మీదకు వచ్చి, జనసేన.. జనసేన అంటున్నారని అంటే వాళ్లు మార్పు కోరుకుంటున్నారని, రాయలసీమ స్వేచ్ఛను కోరుకుంటోందన్నారు. కడప జిల్లాకి ఓట్లు కోసం రాలేదు మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చానని చెప్పారు. గ్రూపు వర్గ రాజకీయాలు నుండి రాయసీమకి కావలసింది స్వేచ్ఛ, ఆజాది అన్నారు.
ప్రయివేటు సైన్యంతో రాజకీయం చేసే నీకే అంతుంటే
నాయకులు వేల ఎకరాలు, వేలకోట్లు దోచుకుంటున్నారని, రాయలసీమ వెనకబడిన ప్రాంతం కాదనివెనక్కి నెట్టబడిన ప్రాంతమన్నారు. కేవలం కొన్ని కుటుంబాల పాలనతోనే రాయలసీమ నలిగిపోతోందన్నారు. ప్రయివేటు సైన్యంతో, రౌడీలతో రాజకీయంతో రాజకీయం చేసే మీకే అంత ధైర్యం ఉంటే, దేశం కోసం చచ్పిపోయేవాడిని నాకు ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. మేము టీడీపీ తో జత కట్టామని జగన్ చెబుతున్నారని, కానీ టీడీపీ మెడలు వంచి, ప్రశ్నించి, ప్రజాక్షేత్రంలో నిలబెట్టిందే జనసేన అన్నారు. భయపెట్టేవాడు నాయకుడు కాదని, స్వేచ్ఛను ఇచ్చేవాడు నాయకుడు అన్నారు.
మీ రౌడీ రాజకీయాలు, పిచ్చి వేషాలు వేస్తే.. పీకి పారేస్తా
రౌడీ నాయకులకు చెబుతున్నానని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే కొమ్మలు పీకి పారేస్తా జాగ్రత్త అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రెడ్డి అంటే రక్షించేవాడే గాని, దోపిడీ చేసే వాడు కాదని నేను కర్నూలు సభలో చెప్పాను, ఆ తరువాత రోజు రెడ్డి కుల పెద్దలు వచ్చి చాలా మంచి మాట చెప్పారని తనతో అన్నారని చెప్పారు. మీ కత్తులు, బాంబులకు, రౌడీ రాజకీయాలకు నేను భయపడనని చెప్పారు. పవన్ పేరున చివరలో కులం ఉండదని చెప్పారు. సమస్యలపై జగన్ ఎప్పుడూ మాట్లాడరని చెప్పారు. ప్రభుత్వం పని తీరు, ప్రతిపక్ష వైసీపీ బాగుంటే జనసేన అవసరం సమాజానికి ఉండకపోయేదని చెప్పారు.
నా పొగరు, తెగింపు తట్టుకోలేరు
పెద్దలు సరిగ్గా రాజకీయం చేస్తే సరేనని, లేదంటే సల సల రక్తం మరుగుతున్న బాంబులాంటి యువతని రాజకీయాల్లోకి దింపుతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. మాట మార్చే నాయకులు కాకుండా మాట మీద నిలబడే నాయకులు కావాలన్నారు. జనసైననికులపై దాడులు చేస్తే ఊరుకోనని, తన కోపం, తెగింపు, పొగరు మీరు తట్టుకోలేరని జగన్, చంద్రబాబులను ఉద్దేశించి చెప్పారు. మేం టీడీపీతో కలిసి పోటీ చేయమని, వామపక్షాలతో కలిసి సాగుతామన్నారు. పల్లకీలు మోసింది చాలునని, ఇక ముగింపు పలుకుదామన్నారు.