కరీంనగర్ లో బావిలో పడ్డ కారు.. ఐదుగురు గల్లంతు, రంగంలో రెస్క్యూ టీమ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక కారు వ్యవసాయ బావిలో పడిపోయింది. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా కారు చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు వద్ద అదుపుతప్పి బావి లోకి దూసుకు వెళ్ళింది. అయితే కారులో ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు ఉన్నారని స్థానికులు భావిస్తున్నారు.
వ్యవసాయ క్షేత్రానికి పనిమీద వెళ్ళిన రైతు కారు బావిలో మునిగిపోవడాన్ని గమనించి ఇరుగు పొరుగు రైతులను పిలిచాడు. కారు వ్యవసాయ బావి లోకి దూసుకుపోవడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును వెలికి తీసే ప్రయత్నాలు సాగిస్తున్నారు. కారు బావిలో పడడంతోనే అది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కారులో ఉన్నవారు కూడా నీటిలో మునిగిపోయారు. అందరూ చూస్తుండగానే కారు జల సమాధి అయింది.

వర్షాకాలం కావడంతో బావిలో ఫుల్లుగా నీరు ఉన్న కారణంగా 20 అడుగుల కంటే ఎక్కువ లోతులోనే కారు పడినట్లుగా భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టారు. గజ ఈతగాళ్లు రెస్క్యూ సిబ్బందితో బావిలో పడిన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో కారులో ఎంతమంది ఉన్నారు? వారు సురక్షితంగా బయట పడతారా లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
కరీంనగర్ లో బావిలో పడ్డ కారు.. ఐదుగురు గల్లంతు, రంగంలో రెస్క్యూ టీమ్#Car , #Karimnagar pic.twitter.com/WH4GQf31qQ
— oneindiatelugu (@oneindiatelugu) July 29, 2021












Click it and Unblock the Notifications