బండి సంజయ్కు నో బెయిల్: 14 రోజుల రిమాండ్: కోర్టులో చుక్కెదురు
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్కు బెయిల్ లభించలేదు. ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు పంపించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, కోవిడ్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘిస్తూ దీక్ష చేపట్టడం వంటి కారణాలతో కరీంనగర్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి సంజయ్ దాఖలు చేసిన పిటీషన్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. కోవిడ్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించినందు వల్ల ఆయనను జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేసీఆర్ సర్కార్.. పలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిని ఉల్లంఘిస్తూ బండి సంజయ్ దీక్షను చేపట్టారు.
ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ.. ఆయన దీక్షను చేపట్టారు. దీనితో రాత్రి బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 353, 332, 327 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాల ఉల్లంఘన చట్టం కిందా ఎఫ్ఐఆర్ను రికార్డు చేశారు. ఆయనతో పాటు మాస్కులు ధరించని కారణంగా దీక్షలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు 25 మందిపైనా కేసు పెట్టారు.
బండి సంజయ్ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు అడ్డుకున్న కారణంగా మరో 16 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలపైనా కేసు నమోదు చేసినట్లు జిల్లా పోలీసులు పేర్కొన్నారు. రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన తరువాత పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తరలించారు. ఈ మధ్యాహ్నం ఆయనను న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతోన్నందున..సభలు, సమావేశాలు, దీక్షలను నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.
కోవిడ్ ప్రొటోకాల్స్ను ఉల్లంఘించారని స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులను న్యాయస్థానానికి సమర్పించారు. వాటన్నింటినీ పరిశీలించిన తరువాత న్యాయస్థానం బండి సంజయ్కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించాలని ఆదేశించింది. దీనితో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను కరీంనగర్ జిల్లా కారాగారానికి తరలించారు. మళ్లీ బెయిల్ పిటీషన్ను దాఖలు చేస్తామని బండి సంజయ్ తరఫు న్యాయవాది తెలిపారు.