ఈటల తూటాలు.. సంచలన వ్యాఖ్యలు.. టార్గెట్ ఎవరు.. తెలంగాణ రాజకీయాల్లో హీట్..!
కరీంనగర్ : మంత్రి ఈటల రాజేందర్ మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ పుట్టించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించే ఈటల ఇలా మాట్లాడటం బాంబ్ పేల్చినంత పనైంది. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినోళ్లం.. మంత్రి పదవి నాకు బిక్ష కాదంటూ ఆయన మాట్లాడిన తీరు హాట్ టాపికైంది. తాము గులాబీ జెండా ఓనర్లమని.. అడ్డుకునే వాళ్లం కాదు, అడుక్కునే వాళ్లం అంతకంటే కాదని మనసులోని ఆవేదనంతా వెళ్లగక్కినట్లుగా ఆయన స్పందించిన తీరు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది.

కొత్త చర్చకు దారి తీసిన మంత్రి ఈటల తూటాలు..!
తెలంగాణ రాజకీయాల్లో ఉద్యమం నాటి సీన్ మరోసారి కనిపించినట్లైంది. మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. తన మనసులోని ఆవేదన వెళ్లగక్కారా.. తనపై ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించారా.. అనే డైలామా క్రియేట్ చేసేలా ఉన్న ఈటల మాటల తూటాలు ఒక్కసారిగా అలజడి రేపాయి. ఎప్పుడూ సైలెంట్గా కనిపిస్తూ.. తన పని తాను చేసుకుపోయే మంత్రి ఈటల మనోవేదన వెనుక అసలు కారణాలేంటనేది ఇప్పుడు సరికొత్త ప్రశ్న. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పార్టీ నేతల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడిన తీరు సెన్సేషన్గా మారింది. మంత్రి పదవి తనకు బిక్ష కాదని.. బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని ఎప్పుడు అడగలేదని చెప్పుకొచ్చారు.

మంత్రి పదవిపై అదో రకంగా చర్చ.. ఈటల హార్ట్ అయ్యారా?
ఈటల మంత్రి పదవిపై ఇటీవల అదో రకంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్ కలెక్టర్లతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన చర్చలు లీక్ చేశారనేది ఆయనపై కొన్ని పేపర్లలో వార్తా కథనాలు వచ్చాయి. ఆ రకంగా ఆయన మంత్రి పదవికి ఎసరొస్తుందని పిచ్చి కూతలు కూసేవాళ్లు ఎక్కువైపోయారు. ఆ విషయంలో ఆయన సన్నిహితులతో బాధపడ్డారనే టాక్ వినిపిస్తోంది. అదే క్రమంలో హుజురాబాద్లో జరిగిన సమావేశంలో తన మనసులోని ఆవేదనంతా వెళ్లగక్కారు ఈటల.
తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినా.. పార్టీలోకి మధ్యలో రాలేదు.. మంత్రి పదవి కోసం ఏనాడూ పాకులాడలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం తెగింపుతో కొట్లాడిన నేపథ్యం తనకు మంత్రి పదవి తెచ్చి పెట్టిందని గుర్తు చేశారు. తన మంత్రి పదవిపై వస్తున్న చిల్లర వార్తలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు.

5 రూపాయలు కూడా లంచం తీసుకోలేదు.. నిరూపిస్తే తప్పుకుంటా..!
15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినుంచైనా కేవలం 5 రూపాయలు లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు ఈటల. అనామకుడిగా వచ్చి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర తన సొంతమని చెప్పుకొచ్చారు. తనకు రాజకీయ వారసత్వం లేదని.. తనకు తానుగా నిలబడ్డానని, ఇక ముందు కూడా అలాగే నిలబడతానిని గర్వంగా చెప్పారు.
ఈటల రాజేందర్ అనేవాడు కులం కార్డుతో వచ్చినోడు కాదని స్పష్టం చేశారు. కులంతో ఏనాడు కొట్లాట పెట్టలేదని.. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడినోడినంటూ చెప్పుకొచ్చారు. అసలు ఈటలకు మంత్రి పదవి రాకపోతుండే అని ఓ పత్రిక రాసిన వార్తను పరోక్షంగా ప్రస్తావిస్తూ మాటల తూటాలు సంధించారు. ఆనాడు తనపై పీడీ యాక్టులు పెట్టాలని, జైల్లో పడేయాలని కొన్ని ముఠాలు కక్ష గట్టాయని ఆరోపించారు. తనను చంపాలని రెక్కీలు నిర్వహించిన సమయంలో సంపుతారా కొడకా అంటూ ఛాలెంజ్ విసిరిన తెలంగాణ బిడ్డను అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.

ఉద్యమ స్ఫూర్తితో గెలిచా.. పార్టీ మారాలనే వత్తిడికి తలొగ్గలేదు..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పార్టీ మారాలనే వత్తిడికి తలొగ్గని తాను.. తెలంగాణ విముక్తి పోరాటం వల్లే గెలిచానని చెప్పుకొచ్చారు ఈటల. అదే విషయం వైఎస్కు కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఉద్యమ స్ఫూర్తితో గెలిచానే తప్ప.. తనకు తానుగా విజయం సాధించలేదని గుర్తు చేశారు. గులాబీ జెండాకు ఓనర్లం తామేనని.. అడుక్కోవడానికి వచ్చినోళ్లం కాదని.. బతుకచ్చినోళ్లం అంతకంటే కాదని ఉద్విగ్నభరితంగా మాట్లాడిన తీరు రాజకీయ ప్రకపంనలు సృష్టిస్తోంది.

ఈటెల అనేవాడు వెలిగే దీపం.. ఆత్మగౌరవంతో బతుకుతా..!
ఈటల అనేవాడు వెలిగే దీపమే తప్ప ఇంకోటి కాదన్నారు. పౌరుషాల తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికేవాడే తప్ప చిల్లరమల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఎవడు హీరో.. ఎవడు జీరో తెలిసే రోజు వస్తుందని ఆశగా ఎదురుచూసే వాడిని తప్ప అనవసరంగా ఆందోళన చెందే వ్యక్తిని కాదన్నారు. కుసంస్కారం ఉన్న నేతలు.. సొంతంగా జనాల్లో తిరగలేని నేతలు.. తమకు తాముగా ఎదగలేని నేతల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ధర్మం నుంచి అలాంటి నేతలు తప్పించుకోలేరని.. ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప.. నేతలు కాదనే సత్యాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications