హోళీ పండగ రోజు విషాదం: స్నానం కోసం వెళ్లి ముగ్గురు బాలురు మృతి
హోళీ పండగపూట విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు.
కరీంనగర్: హోళీ పండగపూట విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని మానేరు వాగులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వాగులోంచి ముగ్గురు బాలుర మృతదేహాలను బయటికి తీశారు. మరో బాలుడి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని మానేరువాగులో మంగళవారం మధ్యాహ్నం ముగ్గురు బాలురు స్నానం కోసమని వెళ్లారు. వారు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులో ఆందోళన చెందారు. సాయంత్రం కావడంతో మరింత ఆందోళన చెందిన తల్లిదండ్రులు మానేరువాగులో పిల్లల కోసం గాలించారు. పిల్లలందరూ 14, 15 ఏళ్లకు చెందిన వారే.

వాగులో తీగల బ్రిడ్జి పనుల నిర్మాణం కోసమని పెద్ద పెద్ద బండ రాళ్లను తొలగించగా.. వాటి వలన ఏర్పడిన గోతిలో పిల్లలు విగత జీవులుగా తెలియాడటం చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికుల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చగా.. అప్పటికే మృతి చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు కేసు నమోదు చేసుకుని మిగిలిన స్నేహితుల గురించి ఆరా తీశారు.
కాగా, మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, ఒంగోలు ప్రాంతానికి చెందినవారు. కూలీ పనుల నిమిత్తం కరీంనగర్ వలస వచ్చి పిల్లలతో ఇక్కడే జీవిస్తున్నారు. పొట్టకూటి కోసం వచ్చి జీవిస్తుండగా.. పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ముగ్గురు పిల్లల మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications