ఇంట్రెస్టింగ్, తెలుగుగడ్డ మీద ఒకే వేదికపై రాహుల్ గాంధీ-చంద్రబాబు: సరికొత్త రాజకీయం
Recommended Video

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఓకే వేదికపై చూడనున్నారు. ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన సమయంలో ఇరువురిని ఓకేచోట చూశాం.
కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత తెలుగు రాష్ట్రాలలో వీరిద్దరిని ఒకే వేదికపై చూడబోతున్నాం. ఖమ్మం జిల్లాలోని బహిరంగ సభలో రాహుల్, చంద్రబాబు పాల్గొనున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార రంగంలోకి ఏపీ సీఎం దిగినట్లే. ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం శివారులోని గొల్లగూడెం చేరుకున్నారు. ఇక్కడ ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ గాంధీ ఖమ్మం వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిమిషాల తేడాతో ఇరువురు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

కొత్త రాజకీయానికి వేదిక
దశాబ్దాల తర్వాత చంద్రబాబు, రాహుల్ గాంధీ కలవడం ద్వారా కొత్త రాజకీయానికి ఇది వేదిక కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలకు ఇరువురు కలిసి ఒకే వేదికపై సమాధానం చెప్పనున్నారు. ఇది మరింత ఆసక్తిని రేపుతోంది. వారు ఏం మాట్లాడుతారనేది అందరిలోను ఉత్కంఠ ఉంది.

ఇరువురు నేతలు చర్చనీయాంశం
చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఉమ్మడి వేదిక జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుందనే చర్చ కూడా సాగుతోంది. వేరే రాష్ట్రాలలో ఇరువురు నేతలు కలవడం వేరు.. తెలుగు రాష్ట్రాలలో కలవడం వేరు. ఇది తెలుగు ప్రజలకు ఎంతో ఆసక్తికరమైన విషయమని చెప్పవచ్చు. దీనిపై రాజకీయ పార్టీలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.

కలయిక ఆవశ్యమని కాంగ్రెస్, టీడీపీ, దుమ్మెత్తిపోస్తున్న విపక్షాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాసను టార్గెట్గా చేసుకొని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయి. ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని టీడీపీ నిప్పులు చెరుగుతోంది. దీంతో పాటు జాతీయ రాజకీయాలను చెడగొడుతున్న బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీతో కలిసినట్లు చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపై పుట్టిన టీడీపీ అదే పార్టీతో కలవడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి.
నేటి ఎన్నికల్లో అతిరథ మహారథులు
కాగా, బుధవారం పలువురు ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, తెరాస అధినేత కేసీఆర్లు ప్రచారంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications