వామ్మో.. వీడేం వాలంటీర్ నాయనా.. వృద్దురాలు పింఛన్ డబ్బు నొక్కేసి
ప్రజలకు నేరుగా సేవలు అందించాలనే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. పారదర్శకంగా పనిచేయడమే వీరి విధి. చదువు రానీ, పేదలకు సాయం చేయడమే కర్తవ్యం.. కానీ రాష్ట్రంలో ఓ వాలంటీర్ తీరు బాగోలేదు. అర్హురాలి పింఛన్ సొమ్ము తీసుకున్నాడు. ఈ విషయం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ తప్పుదారి పడుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య స్వచ్చంద సేవకులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన కొందరు వాలంటీర్లు.. మోసాలకు పాల్పడుతున్నారు. అమాయక వృద్ధులకు ప్రభుత్వం నుంచి చేరాల్సిన పెన్షన్ డబ్బును సాంకేతిక కారణాలు చూపి కాజేస్తున్నారు. అందరూ కాదు.. కొందరే చేసే పనులతో మిగతావారికి ఇబ్బందులు తప్పడం లేదు. వృద్ధులకు అందజేసే అభయహస్తం పింఛనును.. గత రెండు నెలలుగా సంబంధిత వృద్ధురాలికి ఇవ్వకుండా వాలంటీర్ కాజేసిన ఘటన కలకలం రేపింది. కృష్ణాజిల్లా గుడిపాడులో ఘటన జరిగింది.
గుడిపాడుకి చెందిన ఓ వృద్ధురాలికి ప్రభుత్వం నుంచి అభయ హస్తం పధకం కింద ప్రతినెలా పింఛను అందుతుంది. వృద్ధురాలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుపైనే ఆధారపడింది. గత రెండు నెలలుగా వృద్ధురాలి వేలి ముద్రలు తీసుకున్న వాలంటీర్.. నగదును మాత్రం ఇవ్వలేదు. బాధితురాలు పలుమార్లు ప్రశ్నించినా.. ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు రాలేదంటూ వాలంటీర్ మాయమాటలు చెప్పాడు.
స్థానిక యువకులు కొందరు గ్రామ సచివాలయంలో ఆరా తీయగా.. వాలంటీర్ బాగోతం బయటపడింది. ఘటనపై గుడిపాడు విల్లేజ్ వెల్ఫేర్ అసిస్టెంట్ స్పందిస్తూ.. వాలంటీర్ను మందలించి డబ్బును సదరు బాధితురాలికి అందించారు. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యతల నుంచి తప్పించాల్సి వస్తుందని వెల్ఫేర్ అసిస్టెంట్ వాలంటీర్ను హెచ్చరించారు.