తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?
కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తమ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల లోకసభ టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు.
జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!
అదే సమయంలో తన అల్లుడు శ్రీధర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి చేస్తారని చెబుతున్నారట. ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నంద్యాల నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. సోదరి అఖిల దగ్గరుండి గెలిపించారు. భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
నంద్యాలపై కొత్త ట్విస్ట్
ఆళ్లగడ్డ, నంద్యాలల నుంచి భూమా కుటుంబం ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇలాంటి సమయంలో ఎస్పీవై రెడ్డి తాను నంద్యాల లోకసభకు పోటీ చేస్తానని, తన అళ్లుడు శ్రీధర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎస్పీవై రెడ్డి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.
అల్లుడికి నంద్యాల అసెంబ్లీ సీటు
ఎస్పీవై రెడ్డి వ్యాఖ్యలతో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారినట్లుగా కనిపిస్తోంది. నంద్యాల లోకసభ నుంచి తానే పోటీ చేస్తానని అధినేత చంద్రబాబుకు చెప్పిన ఎస్పీవై రెడ్డి.. నంద్యాల అసెంబ్లీ సీటును తన అల్లుడికి కేటాయించాలని కోరినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
చంద్రబాబు ఎవరికి చెక్ చెబుతారు?
నంద్యాల లోకసభ నుంచి ఎస్పీవై రెడ్డి, అసెంబ్లీ నుంచి ఆయన అల్లుడు పోటీ చేస్తే, ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల నుంచి, ఆయన సోదరి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురిలో ఒకరికి చంద్రబాబు చెక్ చెబుతారా అనేది ముందు ముందు తేలనుంది.
కర్నూలు రసవత్తరం
గతంలో మంత్రి నారా లోకేష్ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇటీవల అఖిలప్రియ ఆళ్లగడ్డలో మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో తనపై ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ విజయం సాధిస్తానని చెప్పారు. మొత్తానికి కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.