సీఎం కేసీఆర్ చొరవ.. నడిచొచ్చిన పట్టా, చెక్కు.. రైతు కుటుంబంలో ఆనందం
Recommended Video
మంచిర్యాల : రైతు కుటుంబాన్ని వేధిస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడింది. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడంతో గంటల వ్యవధిలో బాధితులకు న్యాయం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తమ బాధను పంచుకున్న యువరైతు శరత్ కన్నీటిగాధ కేసీఆర్ ను కదిలించింది. స్వయంగా ఆయనే ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆ మేరకు శరత్ కుటుంబానికి సంబంధించిన భూముల పట్టాతో పాటు రైతు బంధు చెక్కు కూడా అందించారు. అటు ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
సీఎం చొరవ.. బాధితులకు న్యాయం
రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. తమ భూమికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి మహాప్రభో అంటూ రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. కాసుల కక్కుర్తికి ఇతర వ్యక్తులతో కుమ్మక్కైన ఉద్యోగులు.. ఆ భూమికి మీకు సంబంధం లేదంటూ వేధించారు. తిరిగి తిరిగి విసిగి వేసారిపోయిన బాధిత కుటుంబం సోషల్ మీడియాను అస్త్రంగా మలచుకుంది. తమకు జరిగిన అన్యాయం సీఎం కేసీఆర్ వరకు వెళ్లేలా షేర్ చేయాలంటూ పోస్టును వైరల్ చేశారు. అది కాస్తా కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. స్వయంగా ఫోన్లో మాట్లాడిన కేసీఆర్.. గంటల వ్యవధిలో వారికి న్యాయం జరిగేలా చూశారు.
83 శాతం పట్టభద్రులు వ్యతిరేకించారు.. టీఆర్ఎస్కు ఇది గుణపాఠమే : జీవన్ రెడ్డి
సోషల్ పోస్ట్.. గంటల్లో పరిష్కారం
నెలలకొద్దీ నానుతున్న భూమి సమస్య వివాదం గంటల వ్యవధిలో పరిష్కారమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో.. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి నెన్నెల మండలంలోని నందులపల్లిలో నివాసముండే బాధితుల ఇంటికి వెళ్లారు. తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని యువరైతు శరత్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తమకు చెందిన 7 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఇతరులకు పట్టా చేశారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని ఈ తతంగానికి పాల్పడ్డారని వివరించారు. బాధిత కుటుంబం బాధను సమగ్రంగా విన్న కలెక్టర్ తగిన న్యాయం చేశారు.
పట్టా, రైతుబంధు చెక్కు.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్
అన్నీ వివరాలు సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ తగిన చర్యలు తీసుకున్నారు. శరత్ కుటుంబానికి చెందిన భూమి తాలూకు పట్టాను ఆయన తండ్రి శంకరయ్యకు అందించారు. ఈ భూవివాదం కారణంగా రైతుబంధు చెక్కులు కూడా బాధిత కుటుంబానికి రాలేదు. దాంతో అత్యవసర నిధుల నుంచి అప్పటికప్పుడు వారికి రావాల్సిన 31 వేల 200 రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు. ఆర్ఐ పెద్దిరాజుతో పాటు వీఆర్వో కరుణాకర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి ఎమ్మార్వో రాజలింగుపై విచారణకు ఆదేశించారు. ఎప్పటినుంచో పరిష్కారం దొరకని తమ సమస్యకు కేసీఆర్ చొరవ తీసుకుని న్యాయం చేయడంతో శరత్ కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.