యాదాద్రి జిల్లాలో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. పైలట్ కు తీవ్రగాయాలు
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో ఆర్మీ ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. బాహుపేట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత పైలట్ ను హైదరాబాద్ లోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలంలో విమానం కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
సరిగ్గా వారం కిందట రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొఖిల గ్రామంలో ప్రైవేట్ శిక్షణ విమానం కూలింది. ఆ ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పైలట్ సురక్షితంగా బయటపడగా.. ట్రైనింగ్ పొందుతున్న భరత్ భూషణ్ అనే యువకుడికి స్వల్పగాయాలయ్యాయి.