ఏమాయే.. కేసీఆర్.. ఏళ్లు గడుస్తోన్నా.. డెవలప్ మెంట్ లేదు: షర్మిల
సీఎం కేసీఆర్పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రజాప్రస్థానంలో భాగంగా 43వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం సీతారామ్ నగర్ గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. సీతారామ్ నగర్ నుంచి కోడూరు మీదుగా సాగి నూతనకల్ మండలం సంగెం గ్రామంలో పాదయాత్ర ప్రవేశించింది. అనంతరం సంగెం నుంచి వెంకెపల్లి, చిల్పకుంట్ల గ్రామాల మీదుగా సాగింది. సాయంత్రం నూతనకల్ మండలకేంద్రంలో ప్రజలతో ముచ్చటించారు. స్థానిక ఎస్సీ కాలనీ దివంగత వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రికి అసలసిసలు నిర్వచనం వైయస్ఆర్. ఐదేండ్లలోనే రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అలా లేదని చెప్పారు. కేసీఆర్ ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు. దళితబంధు ఇస్తానని మోసం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగు భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానని మోసం చేశారని విమర్శించారు.
నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినా, ఏ ఒక్క కుటుంబానికి న్యాయం చేయలేదు. ఒక్కో కుటుంబంపై నాలుగు లక్షల అప్పు మోపుజేసి, లక్ష రూపాయాల మేలు కూడా చేయలేదు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణం అని చెప్పారు. గారడి మాటలతో రెండు సార్లు అధికారంలోకి వచ్చి అడుగడుగునా మోసం చేసిండని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, మహా అయితే టీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ తప్పుడు హామీలు ఇచ్చి, మళ్లీ మోసం చేయాలని చూస్తారు. కేసీఆర్ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దన్నారు. ఓటు వేసే ముందు మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ప్రాంత భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని సూచించారు.