వెంకటేశ్వర స్వామివారి రథానికి దుండగుల నిప్పు: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న సమయంలో..
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రథం పూర్తిగా కాలిపోయింది. మరి కొన్ని రోజుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఆలయ పాలక మండలి సభ్యులు సన్నాహాలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితులో.. ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలాన్ని సృష్టించింది. పాలక మండలి సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Recommended Video
కొండ బిట్రగుంట దేవస్థానానికి చెందిన రథం..
నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండ బిట్రగుంటలో ఈ ఘటన సంభవించింది. కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రసిద్ది చెందినది. నెల్లూరుతో పాటు పొరుగు జిల్లాల నుంచీ భక్తులు స్వామివారిని దర్శించడానికి వస్తుంటారు. ఆలయ ప్రాంగణానికి సమీపంలోని నిలిపి ఉంచిన రథాన్ని రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
వచ్చే నెల 4 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించాల్సి ఉండగా..
ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి ఆలయం ప్రస్తుతం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం ముస్తావు అవుతోంది. వచ్చేెనెల 4వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. చివరిరోజున స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఈ రథం ద్వారా గ్రామంలో ఊరేగించాల్సి ఉంది. దీనికోసం రథానికి కొన్ని మరమ్మతు పనులను కూడా ఇటీవలే పూర్తి చేయించారు పాలక మండలి సభ్యులు. అంతా సక్రమంగా సాగుతున్న తరుణంలో.. దుండగులు రథానికి నిప్పు పెట్టడం గ్రామస్తులను నివ్వెర పరుస్తోంది.
అప్రమత్తమైనప్పటికీ..
మంటల్లో దగ్ధమౌతోన్న రథాన్ని చూసిన వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రథం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రథాన్ని పరిశీలించారు. అనంతరం పాలకమండలి సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ భరత్ కుమార్ కేసు నమోదు చేసుకున్నారు.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు..
ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్తో ఫోనులో మాట్లాడారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు ఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని అన్నారు. ఈ ఘటన పట్ల నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు.